వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు.
అందుకే అతడిని వైస్ కెప్టెన్ని చేశాము
ఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ను కెప్టెన్గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!
రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాము.
ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడు
దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.
ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
చదవండి: టీమిండియాకు శుభవార్త


