ఇషాన్తో వైభవ్ (PC: BCCI X)
టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఊహించని ప్రమోషన్ దక్కింది. ఇటీవల జింబాబ్వే గడ్డ మీద టీ20 సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు... దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏకంగా వైస్ కెప్టెన్గా అతడు నియమితుడయ్యాడు.
అభిమానుల హర్షం
భవిష్యత్తులో వైభవ్ను అన్ని ఫార్మాట్ల ప్లేయర్గా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగు కానుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే వైభవ్కు ప్రతిష్టాత్మక టోర్నీలోని జుట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల అభిమానులు హర్షం చేస్తున్నారు.
అదే విధంగా.. ‘వైభవ్ పిన్న వయసులోనే ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికవడం బిహార్ క్రికెట్కు గర్వకారణం. అతడి అద్భుత ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకముంచారు’ అని బిహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.
వైస్ కెప్టెన్గా ఎలా ఎంపిక చేస్తారు?
అయితే, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఈ పదిహేనేళ్ల పిల్లాడిని సీనియర్ జట్టుకు వైభవ్ను వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘సీనియర్ రెడ్బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటో నాకర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు ఇప్పటి వరకు రెడ్బాల్ క్రికెట్లో కేవలం 12 ఇన్నింగ్స్ ఆడి.. 207 పరుగులు చేశాడు.
అతడి ప్రతిభ అసాధారణం. కానీ ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అతడు ఇంకా మొదటి దశలోనే ఉన్నాడు’’ అని హర్షా భోగ్లే సెలక్టర్ల నిర్ణయాన్ని విమర్శించాడు.
ఇషాన్ కిషన్ సారథ్యంలో
కాగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇషాన్ కిషన్ సారథ్యంలో 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టును బుధవారం ప్రకటించారు.
కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడి 207 పరుగులు చేశాడు. ఇక సూర్యవంశీకి ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాగా... సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ , షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్కు ఈస్ట్ జోన్ జట్టు:
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, షిక్జార్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రంసు సేనాపతి, డేనిశ్ దాస్, అభిజిత్ సర్కార్.
చదవండి: శ్రీలంకతో టెస్టులకు పంత్ను ఎలా సెలక్ట్ చేశారు?: డివిలియర్స్
I wonder what the thinking is behind making Sooryavanshi vice-captain of a senior red ball team. He has played 12 innings for 207 runs @ 17.25. His talent is extraordinary but there is a learning curve and he is at the bottom of it in red ball cricket.
— Harsha Bhogle (@bhogleharsha) July 30, 2026


