ఇండియన్ ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త! ఐదుసార్లు వరల్డ్కప్ చాంపియన్ బ్రెజిల్ జట్టు భారత గడ్డపై తొలిసారి అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 3న కోల్కతాలోని చారిత్రాత్మక సాల్ట్ లేక్ స్టేడియంలో భారత్తో బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది.
ఈ విషయాన్ని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్), బ్రెజిల్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (సీబీఎఫ్) ఈ విషయాన్ని గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ధ్రువీకరించాయి. సీనియర్ పురుషుల విభాగంలో టీమిండియా, బ్రెజిల్ జట్లు తలపడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అంతేకాకుండా 1992లో ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్ను తీసుకొచ్చిన తర్వాత.. భారత్ ఎదుర్కోనున్న అత్యధిక ర్యాంకింగ్ కలిగిన జట్టు బ్రెజిలే కావడం విశేషం. బ్రెజిల్ ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్లో ఐదో స్దానంలో ఉంది.
కాగా కోల్కతాకు బ్రెజిల్ ఫుట్బాల్కూ విడదీయరాని అనుబంధం ఉంది. ఫిఫా ప్రపంచకప్ సమయంలో కోల్కతా నగరంలోని ప్రతి వీధి పసుపు, ఆకుపచ్చ రంగుల జెండాలు, దిగ్గజ ఆటగాళ్ల భారీ కటౌట్లతో నిండిపోతుంది. ఇప్పుడు మరోసారి సిటీ ఆఫ్ జాయ్ పసుపు, ఆకుపచ్చ రంగుల సముద్రంగా మారిపోయింది.
తమ అభిమాన జట్టుకు గ్రాండ్ వెలకమ్ పలికేందుకు ఫ్యాన్స్ సిద్దమవుతున్నారు. కాగా కోల్కతాతో బ్రెజిల్ అనుబంధం 1977లో ప్రారంభమైంది. ఫుట్బాల్ లెజెండ్ పెలే తన 'న్యూయార్క్ కాస్మోస్' క్లబ్ తరఫున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో స్థానిక మోహున్ బగాన్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు.
ఆ మ్యాచ్ భారత ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటిగా నిలిచిపోయింది. ఇక ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్లో బ్రెజిల్ నిరాశాజనక రీతిలో రౌండ్ ఆఫ్ 16లోనే నిష్క్రమించింది.


