source: latestLY
భారత్లో ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ ఫుట్బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబర్లో భారత్లో ఓ అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య (CBF) ఇప్పటికే సెప్టెంబర్ 25న టౌన్స్విల్లే, సెప్టెంబర్ 29న బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్లు ఖరారు చేసింది. వీటికి అదనంగా అక్టోబర్ తొలి వారంలో భారత్లో మరో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ESPN Brasil వెల్లడించింది. ఈ మ్యాచ్కు ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.
ఈ మ్యాచ్కు కోల్కతా వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని సమాచారం.
ప్రపంచకప్ సమయంలో కోల్కతాలో వేలాది మంది అభిమానులు బ్రెజిల్ జెర్సీలు ధరించి సందడి చేయడం.. నెయ్మార్, వినీసియస్ జూనియర్ చిత్రాలతో నగరం కళకళలాడడం CBF దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.
అన్ని చర్చలు విజయవంతంగా పూర్తైతే, తుది ఒప్పందంపై సంతకాలు జరిగి బ్రెజిల్ జట్టు భారత్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో భారత ఫుట్బాల్ అభిమానులకు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాలను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది.


