విరాట్ కోహ్లితో రోహిత్ (PC: BCCI X)
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.
బ్యాట్తోనే సమాధానం
వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్తో లార్డ్స్లో జరిగిన వన్డేనే హిట్మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.
అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.
నిప్పు లేనిదే పొగ రాదు
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సెలక్టర్లదే అంతిమ నిర్ణయం
యూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.
ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.
ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.
వరుస పరాజయాల తర్వాత..
కాగా టీ20 సిరీస్లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లోనూ 1-2తో ఓటమిపాలైంది.
దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


