AUS vs ENG: భారత్‌లో యాషెస్‌ టెస్టు మ్యాచ్‌! | Are Ashes Matches In India Cricket Australia Makes Big Announcement | Sakshi
Sakshi News home page

AUS vs ENG: భారత్‌లో యాషెస్‌ టెస్టు మ్యాచ్‌!

Jul 24 2026 10:54 AM | Updated on Jul 24 2026 11:11 AM

Are Ashes Matches In India Cricket Australia Makes Big Announcement

ఫైల్‌ ఫొటో (PC: CA)

క్రికెట్‌లో అత్యంత ప్రాచీన, ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక సిరీస్‌లలో యాషెస్‌ టెస్టు సిరీస్‌ ఒకటి. ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ పోరు 1882లో మొదలైంది. నాటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి ఇరుజట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.

ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ (FTP)లో భాగంగా జరిగే ఈ సిరీస్‌కు ఆసీస్‌, ఇంగ్లండ్‌ చెరోసారి ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. అయితే, ఈ చారిత్రక సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ను భారత గడ్డపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) సంకేతాలు ఇచ్చింది.

బీసీసీఐతో అనుబంధం
ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈఓ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ ఈ విషయం గురించి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో మా బంధం బలమైనది. అదే విధంగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)తోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి.

ఇండియాలో యాషెస్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడే దీని గురించి మేమేమీ ప్రణాళికలు రచించడం లేదు. కానీ ఈ అంశం అయితే మా పరిశీలనలో ఉంది. ఆసీస్‌- ఇంగ్లండ్‌- ఇండియా మధ్య టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు జట్ల మ్యాచ్‌లకు అభిమానులు ఉన్నారు. వారిని అలరించడం కోసం.. టెస్టు క్రికెట్‌ అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని గ్రీన్‌బర్గ్‌ స్పష్టం చేశారు.

డిసెంబరులో బీబీఎల్‌ మ్యాచ్‌
ఆసీస్‌ టీ20 లీగ్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ (BBL) తాజా ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌- పెర్త్‌ స్కార్చర్స్‌ మధ్య డిసెంబరు 12, 2026న ఈ మ్యాచ్‌ జరుగనుంది.

యాషెస్‌ 2027 షెడ్యూల్‌ ప్రకటన
అదే విధంగా.. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. యాషెస్‌ 2027 షెడ్యూల్‌ను ఈసీబీ ఇటీవలే ప్రకటించింది. జూన్‌ 18- ఆగష్టు 2 వరకు ఈ సిరీస్‌ జరుగుతుంది.

ట్రెంట్‌ బ్రిడ్జ్‌, లార్డ్స్‌, ఎడ్జ్‌బాస్టన్‌, సౌతాంప్టన్‌​, ది ఓవల్‌ మైదానాలు ఇందుకు వేదికలు. ఇక క్రికెట్‌ ఆస్ట్రేలియాకు 2029-2030 సైకిల్‌లో ఆతిథ్య హక్కులు వస్తాయి. కాబట్టి అప్పటికి భారత్‌లో ఒక మ్యాచ్‌ నిర్వహించినా ఆశ్చర్యం లేదు.

చదవండి: వైభవ్‌ మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement