వైభవ్ సూర్యవంశీ (PC: BCCI X)
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రం
ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐర్లాండ్తో టీ20 సిరీస్లో వైభవ్తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్తో రెండు టీ20లు, ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.
మూడు మ్యాచ్లలో విఫలం
ఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్కు ఓపెనర్గా అవకాశం దక్కింది.
ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!
ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్ను ప్రశంసిస్తూ.. గంభీర్ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.
అయినా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?
అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.
అంకిత భావానికి సెల్యూట్
నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.
కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.


