దేశం మారిన టీమిండియా ఆట తీరు మాత్రం మారలేదు. పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఇప్పుడు ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే పరాభవం దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ 2-0 తేడాతో వెనుకబడి ఉంది.
వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లలో అద్భుతాలు చేసిన టీమిండియా.. యూకే పర్యటనలో మాత్రం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మన జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర పరాజయాలను మూట కట్టుకుంది. ఒకప్పుడు వరుస దైపాక్షిక సిరీస్లను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు అదే వరుసగా ఓటములు చవిచూడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కెప్టెన్సీ మార్పు కారణంగానే టీమిండియాకు ఈ పరిస్థితి ఏర్పడందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐర్లాండ్ టూర్కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్గా టీ20 ప్రపంచకప్ను భారత్కు అందించి మూడు నెలల తిరగకముందే సూర్యకుమార్ యాదవ్పై వేటు వేశారు. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. పేలవ ఫామ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సందర్భంగా చీఫ్ సెలక్టర్ అగార్కర్ కానీ స్పష్టం చేశాడు.
అతడి స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు అప్పగించారు. దాదాపు రెండేళ్లగా భారత టీ20 జట్టులోనే లేని అయ్యర్ను తీసుకొచ్చి కెప్టెన్గా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. భారత జట్టును అద్భుతంగా నడిపించిన సూర్యను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుపట్టారు. కానీ అయ్యర్ కూడా సూర్యలానే జట్టును విజయ పథంలో నడిపిస్తాడని టీమ్ మేనెజ్మెంట్తో పాటు బీసీసీఐ కూడా నమ్మింది. కానీ వారి నమ్మకాన్ని శ్రేయస్ వమ్ము చేశాడు.

అక్కడ సక్సెస్.. ఇక్కడ ఫ్లాప్
ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు సంపాదించిన శ్రేయస్ అయ్యర్.. టీమిండియా సారథిగా మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. భారత కెప్టెన్గా తొలి విజయం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. అతడి నాయకత్వంలో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో అన్నింటిలోనూ భారత్ ఓటమి పాలైంది.
అతడి కెప్టెన్సీలోనే తొలిసారి ఐర్లాండ్తో సిరీస్ కోల్పోయి భారత్ ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో 76 పరుగులకే కుప్పకూలి మరో చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో శ్రేయస్ విఫలమవుతున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో డెత్ ఓవర్లో స్పిన్నర్తో బౌలింగ్ చేయించి.. భారత ఓటమికి కారణమయ్యాడు. దీంతో అయ్యర్ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. కెప్టెన్గా శ్రేయస్ కంటే సూర్య ఎంతో బెటర్ అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సలాం సూర్య భాయ్!
నిజంగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో 52 టీ20లు టీమిండియా.. 42 మ్యాచ్లలో విజయం సాధించింది. అంతేకాకుండా అతడి సారథ్యంలోనే భారత్ ఆసియా కప్ (2025)తో పాటు 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ను కూడా సొంతం చేసుకుంది. సూర్యకుమార్ కెప్టెన్సీ కాలంలో టీమిండియా ఒక్క అంతర్జాతీయ టీ20 సిరీస్ను కూడా కోల్పోలేదు. ఆడిన 8 ద్వైపాక్షిక సిరీస్లను క్లీన్ స్వీప్ లేదా విజయంతో ముగించింది.


