తెలంగాణ టీ20 (TG20)-2026లో అన్విత ఖమ్మం ఏసెస్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ను ఓడించిన ఖమ్మం.. టీజీ20లో ఫైనల్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫయర్-1లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
ఖమ్మం బ్యాటర్లలో మికిల్ జైశ్వాల్ కేవలం 34 బంతుల్లో 4 ఫోర్లు,7 సిక్స్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు జీఎస్కే రెడ్డి(40), పరాస్ రాజ్(32) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో ఆఖిల్ రాథోడ్ రెండు, షణ్ముఖ, ప్రణవ్, అజయ్, దేవ్ తలా వికెట్ సాధించారు.
అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగల్గింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి(1) ఆరంభంలో ఔటైనప్పటికి మరో ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి(27 బంతుల్లో 69) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఖమ్మం బౌలర్లలో సహేంద్ర మల్లు మూడు, వేద్ రెడ్డి రెండు వికెట్లు సాధించారు. కాగా శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో కరీంనగర్ డైమండ్స్తో హైదరాబాద్ తలపడనుంది.


