తాత్త్వికథ
చదువులోనే పరీక్షలు కాదు. జీవితాన్ని కూడా పరీక్షించాలి. గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అంటాడు పరీక్షింపబడని జీవితం వ్యర్థ జీవితమని. దీన్ని సమర్థించే సందర్భం కఠోపనిషత్తులో నచికేతుని సత్యాన్వేషణ ప్రయత్నంలో చూస్తాం. నచికేతుడు తన తండ్రి చేస్తున్న యజ్ఞయాగాదులలో ముసలి, నిరుపయోగ ఆవులను దానంగా ఇవ్వడం ఆశ్చర్యమనిపిస్తుంది. తన మదిలో ఇవే ప్రశ్నలు ‘‘ఇది సరియైనదేనా? నిజాయితీ లేని చర్యలకు విలువుంటుందా?’’ అని.
తన మదిలో రగులుతున్న ప్రశ్నలకు సమాధానం తన తండ్రి నుంచి రాబట్టాలనుకుని తండ్రి నడుగుతాడు ‘‘తండ్రీ నువ్వు నన్ను ఎవరికి అర్పిస్తావు?’’ అని. పదే పదే అడుగుతున్న ఈ ప్రశ్నకి తండ్రి కోపోద్రిక్తుడై ‘‘నిన్ను యమునికి (మృత్యువుకి)సమర్పిస్తాను’’ అంటాడు. దాంతో నచికేతుడు యముని దగ్గరకు వెళ్ళి సంపద, ఆధిపత్యం, అమరత్వం కోరకుండా ‘‘మరణానంతరం ఏమవుతుంది? అసలు నిజమైన సత్యం ఏదీ...’’ అని అడుగుతాడు.
యముడు నచికేతుని సంపదలు, రాజ్యం, భోగభాగ్యాలు కోరుకోమంటాడు. కానీ నచికేతుడు ఈ సంపదలు, సౌఖ్యాలు తాత్కాలికాలని...కాబట్టి ఎప్పటికీ చావులేని సత్యమే కావాలని పట్టుబడతాడు. అపుడు యముడు సంతసించి మోక్షసాధనమైన ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇందులో గమనించాల్సింది సాధారణంగా మనుషులు అలవాట్లను, ఆచారాలను, కోరికలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. కానీ నచికేతుడు జీవితాన్ని ప్రశ్నించుకొని, పరీక్షించుకొని తప్పొప్పులు, శాశ్వత–అశాశ్వతాలు, అసలు జీవిత లక్ష్యం ఏమిటి? ఈ శరీర పతనానంతరం నేను ఎవరిని... లాంటి ప్రశ్నలతో పయనించడం వలన సత్యాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందగలిగాడు. సుఖభోగాలతో వెంటాడే జీవితం అసంపూర్ణం, స్వ పరిశీలన, అనుభవం మాత్రమే అర్థవంత జీవితానికి మూలం. ఇదే ఈ కథ మనకిచ్చే సందేశం. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు


