భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు సరికొత్త ఉత్సాహంతో దూసుకెళ్లాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ అనిశ్చితి, భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడిన దలాల్ స్ట్రీట్ ఈరోజు ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. ప్రధాన సూచీలు ఒక శాతానికి పైగా లాభపడి ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ నింపాయి.
ఈరోజు (జులై 10, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి..
బీఎస్ఈ సెన్సెక్స్: 827 పాయింట్లు లాభపడి 77,569 వద్ద స్థిరపడింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ: 244 పాయింట్లు పుంజుకుని 24,206 మైలురాయిని తాకింది.
ట్రేడింగ్ ప్రారంభం నుంచే బుల్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దాదాపు అన్ని రంగాలు లాభాల బాట పట్టడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పెరిగింది.
ఇరాన్-యూఎస్ వార్
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు (ఇటీవల సీజ్ఫైర్ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, పరస్పర క్షిపణి దాడులు) గ్లోబల్ మార్కెట్లను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మార్కెట్ ర్యాలీకి ఈ ఉద్రిక్తతలు సడలడమే ప్రధాన కారణమైంది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు జరిగినప్పటికీ అవి కేవలం సైనిక స్థావరాలకే పరిమితం అవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఏదేమైనా శాంతి చర్చలు జరుగుతాయనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్లు ర్యాలీ అయ్యాయి. ఇరాన్ ఇంధన క్షేత్రాలు లేదా చమురు సరఫరా కేంద్రాలను టార్గెట్ చేయకూడదని ట్రంప్ యంత్రాంగం భావిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఉద్రిక్తతలు ముదిరితే క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్కు 80 డాలర్లు దాటుతుందని భయపడిన మార్కెట్లకు ప్రస్తుత పరిణామాలు ఊరటనిచ్చాయి. చమురు సరఫరాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ బ్రెంట్ క్రూడ్ ధర స్థిరంగా కొనసాగడం భారత్ వంటి దిగుమతి దేశాల మార్కెట్లకు బూస్ట్గా నిలిచింది. చమురు ధరలు అదుపులో ఉండటం వల్ల ద్రవ్యోల్బణ భయాలు తగ్గి సెంటిమెంట్ బలపడింది.
మార్కెట్ ర్యాలీకి తోడైన ఇతర కీలక అంశాలు
అంతర్జాతీయంగా టెక్నాలజీ, ఏఐ రంగాల్లో వస్తున్న భారీ పెట్టుబడుల వార్తలు ఐటీ రంగానికి ఊతాన్నిచ్చాయి. అమెరికాకు చెందిన ప్రముఖ మెమరీ చిప్మేకర్ మైక్రాన్ టెక్నాలజీ దాదాపు 250 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించడంతో వాల్ స్ట్రీట్ (నాస్డాక్) భారీగా పెరిగింది. దీని ప్రభావంతో భారతీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో షేర్లు భారీ లాభాలను ఆర్జించి నిఫ్టీని ముందుకు నడిపించాయి.
స్థిరమైన అమెరికా లేబర్ మార్కెట్
అమెరికాలో విడుదలైన అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ గణాంకాలు ఆ దేశ లేబర్ మార్కెట్ స్థిరంగా ఉందని నిరూపించాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లడం లేదనే భరోసా అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో స్థిరత్వాన్ని పెంచింది.
దేశీయ ఇన్వెస్టర్ల మద్దతు
అంతర్జాతీయంగా ఎటువంటి అస్థిరత ఎదురైనా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ ప్రవాహం మార్కెట్కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది. నేడు దేశీయ కొనుగోళ్లు మార్కెట్ త్వరగా కోలుకోవడానికి దోహదపడ్డాయి.
పశ్చిమాసియా సంక్షోభం పూర్తిగా సమసిపోనప్పటికీ యుద్ధం తీవ్రరూపం దాల్చకపోవచ్చనే అంచనాలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. అయితే రాబోయే రోజుల్లో క్యూ1 ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు మార్కెట్ తదుపరి దిశను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతానికైతే బుల్స్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ నిఫ్టీని మళ్లీ పైకి లాగుతుండడం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఇన్వెస్టర్ల నమ్మకానికి నిదర్శనం.
ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!


