భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఈరోజు గందరగోళంగా మిగిలిపోయింది. గత కొన్ని సెషన్లుగా లాభాల బాటలో పయనిస్తున్న స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో భారీగా నష్టపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 దాదాపు 2% పైగా (516 పాయింట్లు) క్షీణించి 23,882 స్థాయికి పడిపోగా, సెన్సెక్స్ కూడా 1677 పాయింట్లు నష్టపోయి 76,503 వద్దకు చేరింది.
మార్కెట్ పతనానికి కారణాలు
మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియా ఉద్రిక్తతలు. హార్మూజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ప్రతిచర్యగా అమెరికా పవర్ స్ట్రైక్స్ పేరిట దాడులు జరపడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసినట్లు పేర్కొన్నారు. దాంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తారేమోనని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.
భగ్గుమన్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు
భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ముడిచమురు ధరలు పెరగడం సవాలుగా మారుతుంది. నిన్నటి వరకు బ్యారెల్కు 70 డాలర్ల దిగువన ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఏకంగా 2.5% పైగా పెరిగి 76 డాలర్ల మార్కును దాటింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెంచడంతో మార్కెట్ సెంటిమెంట్ను పూర్తిగా దెబ్బతీసింది.
రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో డాలర్ ఇండెక్స్ 101.08 స్థాయికి చేరగా దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే ఏకంగా 20 పైసలు క్షీణించి 95.16 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి పతనం విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.
లాభాల స్వీకరణ
గత నాలుగు సెషన్లుగా మార్కెట్లు నిరంతరాయంగా లాభపడటంతో (సెన్సెక్స్ 1,800 పాయింట్లు, నిఫ్టీ 560 పాయింట్లకు పైగా పెరిగాయి) గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ముఖ్యంగా హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
పశ్చిమాసియా పరిణామాలు శాంతించే వరకు, అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడే వరకు ఇన్వెస్టర్లు తొందరపడి భారీ పెట్టుబడులు పెట్టకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మార్కెట్ దిద్దుబాట్లు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారుతాయని చెబుతున్నారు.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..


