శ్రీనగర్: దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్లో వరద బీభత్సం సృష్టించింది. లార్నూలోని గురిద్రమన్ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్కూల్లో విద్యార్థులను గ్రామస్తులు కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
అధికారుల కథనం మేరకు భారీ వర్షాల నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ఈ ఆకస్మిక వరదలు గ్రామాన్ని తాకాయి. వరద నీరు గ్రామంలోకి చేరిన సమయంలో ఒక స్థానిక పాఠశాలలో పలువురు విద్యార్థులు ఉన్నారు. దీంతో గ్రామస్తులు అప్రమత్తమై ఆ విద్యార్థులను సురక్షితంగా రక్షించారు.
కాగా, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు పలు ప్రాంతాలను అతలాకూతలం చేశాయి. వరదలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కేయీ పన్యోర్ జిల్లాలో వరద ఉధృతికి ఇళ్లు దెబ్బతినడమే కాకుండా, ముగ్గురు వ్యక్తులు గల్లంతయిన సంగతి తెలిసిందే.


