ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం రాత్రి శక్తివంతమైన భూప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా పరిసర ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంప కేంద్రం అఫ్గానిస్తాన్లో ఉన్నట్లు గుర్తించారు. .
ఆప్గానిస్తాన్లోని హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు భారత వాయువ్య ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. భూకంపం చాలా లోతులో సంభవించడంతో దీని ప్రభావం చుట్టుపక్కల చాలా దేశాల్లో కనిపించింది.
కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారుపడ్డారు. నివాసితులు, కార్యాలయ ఉద్యోగులు తమ భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం చాలా లోతులో ఉండటం వల్ల ఉత్తర భారత దేశవ్యాప్తంగా ఈ ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి.


