కోల్కతా: తృణముల్ కాంగ్రెస్కు మరోషాక్ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి రాజీనామా చేశారు. "వ్యక్తిగత కారణాల" వల్లే తాను ప్రాథమిక సభ్యత్వానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తన రాజీనామా లేఖను పంపారు.
పశ్చిమబెంగాల్ సాధారణ ఎన్నికల్లో ఓటమితో మమతా బెనర్జీకి మెుదలైన బ్యాడ్ టైమ్ ఇప్పట్లో ఆగేలా లేదు..అంతర్గత విబేధాల కారణంగా సుమారు 20 మంది ఎంపీలు టీఎంసీ నుంచి వేరుపడే ప్రయత్నాలు చేయడం, అలాగే రిషిబ్రతా బెనర్జీ, సందీప్ సాహా వంటి అసమ్మతి ఎమ్మెల్యేలపై పార్టీ బహిష్కరణ వేటు వేయడం వంటి పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు ఇప్పటికే తృణముల్కు గుడ్బై చెప్పారు. తాజాగా ఆ బాటలోనే చంద్రకుమార్ బోస్ నిలిచారు. వ్యక్తిగత కారణాలతోనే టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా చంద్రకుమార్ బోస్ .. "వ్యక్తిగత కారణాల దృష్ట్యా, నేను అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. మీ భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలోనూ మీకు, ఏఐటీసీకి నా శుభాకాంక్షలు" అని బోస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి రాసిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ నేపథ్యం
2016లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన, 2019 లోక్సభ ఎన్నికల్లో కోల్కతా దక్షిణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విచారణకు హాజరు కావాలని నోటీసులు రావడంతో ఆయన బీజేపీని వీడారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునుమడైన తన పౌరసత్వాన్నే ఎలా సందేహిస్తారంటూ ఆయన అప్పట్లో తీవ్రంగా ప్రశ్నించారు.
ఈ కారణాలతో బీజేపీని వీడి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు, ఏప్రిల్ 12న చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో తాను బీజేపీలో చేరడం పెద్ద "తప్పు" అని ఆయన అభివర్ణించారు.


