పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే: మీసా భారతి | Misa Bhartis Big Attack on Prashant Kishor After Bankipur Victory | Sakshi
Sakshi News home page

పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే: మీసా భారతి

Aug 4 2026 8:53 AM | Updated on Aug 4 2026 8:56 AM

Misa Bhartis Big Attack on Prashant Kishor After Bankipur Victory

బిహార్‌లోని బంకీపూర్‌ ఉప ఎన్నికలో జనసూరాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన విజయం సాధించిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 35 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని కైవసం చేసుకున్న పీకే విజయంపై విపక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. లాలూ కూతురు, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రశాంత్‌ కిషోర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన గెలుపు వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఆరోపించారు.

బంకీపూర్‌ ఫలితాలపై ఇండియా టుడేతో మాట్లాడిన మీసా భారతి.. బీజేపీ అధికారిక అభ్యర్థి నీరజ్‌ కుమార్‌ కాదని, అసలు అభ్యర్థి ప్రశాంత్‌ కిషోర్‌ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన సొంత బలంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేమని భావించి పరోక్షంగా పీకేకు మద్దతిచ్చిందని ఆరోపించారు. “మీరు బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌ అని అనుకుంటారు.. కానీ అసలు అభ్యర్థి ప్రశాంత్‌ కిషోర్‌” అని ఆమె పేర్కొన్నారు. బంకీపూర్‌ ఎప్పటి నుంచో బీజేపీ బలమైన ప్రాంతమని, అక్కడ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి నష్టం లేదని వ్యాఖ్యానించారు.

“పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే”
ప్రశాంత్‌ కిషోర్‌ విజయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచే ప్రయత్నం చేశారని మీసా భారతి మండిపడ్డారు. బీజేపీ అధికారిక అభ్యర్థి ఓడిపోయినప్పటికీ.. పీకే గెలవడం ద్వారా బీజేపీ తన లక్ష్యాన్ని సాధించిందన్నారు. బీజేపీ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆమె.. సొంతంగా గెలిచే నమ్మకం లేకపోవడం వల్లే ప్రశాంత్‌ కిషోర్‌ను రంగంలోకి దింపారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

“గుంటనక్క” అంటూ విమర్శలు
ప్రశాంత్‌ కిషోర్‌ రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసిన మీసా భారతి.. ఆయనను “గుంటనక్క”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని ఆరోపించారు.

తేజస్వి గైర్హాజరుపై వివరణ
బంకీపూర్‌ ప్రచారంలో ఆర్జేడీ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలను మీసా భారతి ఖండించారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్‌ వ్యక్తిగత పర్యటనలో ఉండటం వల్ల ప్రచారానికి రాలేకపోయారని సమర్థించారు. అదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విమర్శలు చేశారు. విద్యార్థుల నిరసనలు జరుగుతున్న సమయంలో విదేశీ పర్యటనలపై ప్రశ్నలు లేవనెత్తారు. 

ఇదిలా ఉంటే.. విజయ సంబురాల్లో ఉన్న జన సురాజ్‌ పార్టీగానీ, ప్రశాంత్‌ కిషోర్‌గానీ మీసా భారతి ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. 

36 రౌండ్ల పాటు ఆధిక్యం.. భారీ మెజారిటీతో విజయం
బంకీపూర్‌ ఉప ఎన్నికలో ప్రశాంత్‌ కిషోర్‌ తొలి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 36 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆయన ఆధిక్యాన్ని కొనసాగించారు. జనసూరాజ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రశాంత్‌ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్‌ కుమార్‌ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చాయి. దాదాపు 19,324 ఓట్ల మెజారిటీతో పీకే విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇదే స్థానం నుంచి నితిన్‌ నబీన్‌(98,299 ఓట్లు) రేఖా కుమారి(46,363 ఓట్లు)పై దాదాపు 52 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

35 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు
బంకీపూర్‌ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి పట్టున్న ప్రాంతంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే తాజా ఉప ఎన్నికలో ప్రశాంత్‌ కిషోర్‌ విజయం సాధించడం ద్వారా జనసూరాజ్‌ పార్టీకి అసెంబ్లీలో తొలి అడుగు పడింది.

ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్‌ కిషోర్‌.. రాజకీయ నాయకుడిగా మాత్రం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే బంకీపూర్‌ ఫలితం కేవలం బీజేపీకి ఎదురుదెబ్బ మాత్రమే కాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విజయం ద్వారా ప్రశాంత్‌ కిషోర్‌ ఆర్జేడీ రాజకీయ స్థలానికే సవాల్‌ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లలో కొంత భాగం జనసూరాజ్‌ వైపు మళ్లడం ఆర్జేడీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటివరకు బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష శక్తిగా ఉన్న ఆర్జేడీకి ముస్లిం–యాదవ్‌ (ఎంవై) ఓటు బ్యాంకు ప్రధాన బలంగా ఉండేది. అయితే బంకీపూర్‌లో సంప్రదాయంగా ఆర్జేడీ వైపు ఉండే కొన్ని వర్గాల ఓట్లు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ వైపు మళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయంగా జనసూరాజ్‌ను కొందరు ఓటర్లు చూడటం మొదలుపెడితే.. భవిష్యత్తులో బీహార్‌ ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement