ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అన్ని వర్గాల ప్రజల మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు.
‘హైదరాబాదులో ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. హిట్లర్ ఎన్ని దుర్మార్గాలకు వడిగట్టాడు అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ నాకు ఆదర్శం, స్ఫూర్తి అని సీఎం రేవంత్ అంటున్నారు. హైడ్రా నల్లచెరువులో బుచ్చమ్మ అనే మహిళ చనిపోయింది. హైడ్రా పేదల ఇళ్లను కూల్చే , వేధించే సంస్థ వచ్చింది. హైదరాబాద్ పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తుంది. హైడ్రా ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్ర పడింది. 95% ప్రజలు హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది.
రేవంత్ రెడ్డి మాట కూడా హైడ్రా వినలేని పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రవర్తించారు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను వికలాంగులుగా గుర్తించాలి. వికలాంగుల చట్టం లో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను చేర్చాలి. కిడ్నీ పేషెంట్ కుటుంబాలలో అంధకారం నెలకొంది. హైదరాబాదులో అనేక చెరువులు కుంటలు, మాయమయ్యాయి. వాగులు, డ్రైనేజీలు కెమికల్ వేస్ట్గా మారిపోయాయి. హైదరాబాద్ అభివృద్ధి లో అవుతున్న కొత్త కాలనీలు చెరువు పక్కన ఇల్లు ఉంటే దుర్గంధం అవుతున్నాయి’ అని స్పష్టం చేశారు.


