సాక్షి, గుంటూరు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఖరిపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పే అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలి. అర్ధరాత్రి వేళల్లో మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి, తలుపులు పగులగొట్టి పోలీసులు తనిఖీలు చేయడమేనా ఆయన తెచ్చే అభివృద్ధి? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
గుంటూరు జిల్లాలో హోం డిపార్ట్మెంట్ పూర్తిగా పెమ్మసాని జేబులోనే ఉందని, ఆయన కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం నడుస్తోందని ఆరోపించారు.నా ఇంటిపై దాడి చేయించారు. గతంలో తన ఇంటిపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అంబటి భావోద్వేగానికి గురయ్యారు. "నా ఇంటిపై దాడి చేసే సమయంలో 24 గంటల్లో సినిమా చూపిస్తా అని పెమ్మసాని ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయనకు తప్పు చేశాననే భావన ఉంది.. ఎందుకంటే ఆయన ఒక నేరస్థుడు అని మండిపడ్డారు.
తాను నల్లపాడు పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న సమయంలో జరిగిన ఒక అంతర్గత విషయాన్ని అంబటి బయటపెట్టారు. నేను నల్లపాడు స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడి ఇద్దరు సీఐలకు పెమ్మసాని స్వయంగా ఫోన్ చేశారా లేదా? ఒకవేళ ఆయన పోలీసులకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే, నేను ఆయన కాళ్లకు దండం పెడతా అంటూ సవాల్ విసిరారు. పెమ్మసాని మీద తనకు ఎలాంటి వ్యక్తిగత కోపం లేదని, కానీ తన ఇంటిపై దాడి చేయించి క్రూరత్వానికి పాల్పడినందుకే తాను తీవ్రమైన కడుపుమంటతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. నా ఇంటిపై దాడి చేసిన వారిలో ఇంతవరకు పోలీసులు ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? అని నిలదీశారు.


