తాడిపత్రిటౌన్: నేను దుర్మార్గుడినే..దుష్టు డినే ఏమన్నా అనుకోండి.. ఆ 24 మంది వైఎస్సార్సీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదు అంటూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, లీగల్సెల్ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
అలాగే తాడిపత్రి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి చెందిన 24 మంది పేర్లు చదువుతూ వారిలో ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. కేతిరెడ్డికి నాకు మాత్రమే ఫైట్ అని, ఇది టీడీపీ, వైఎస్సార్సీపీ సమస్య కాదన్నారు. వైఎస్సార్సీపీలోని ఆ 24 మంది వచ్చే స్థానిక ఎన్నికల్లో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఈనెల 6న తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట 24 మంది వైఎస్సార్సీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.


