వైఎస్ఆర్ జిలా: ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద సీఏ విద్యార్థిని రమ్యశ్రీని కాపాడుకునేందుకు దాతృత్వం పోటెత్తుతోంది. ఆమె వైద్య ఖర్చుల దీనగాథపై గత నెల 18న ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన ‘పేద... ఆపై పెద్దబాధ‘ అనే ప్రత్యేక కథనానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రమ్యశ్రీ ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్కు రూ.50 లక్షలు అవసరం కాగా.. ’సాక్షి’ కథనం చూసి స్పందించిన దాతలు ఇప్పటివరకు రూ.24 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
రూ.10 లక్షల భారీ విరాళం
రమ్యశ్రీని ఆదుకునేందుకు తిరుపతి బాలాజీ కాలనీలోని ’ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ కళాశాల చైర్మన్ సీఏ మన్నెం సింహాద్రి ముందుకు వచ్చారు. ఆయన తన అకాడమీ తరఫున ఏకంగా రూ.10 లక్షల భారీ విరాళాన్ని పుంగనూరులో రమ్యశ్రీ తల్లిదండ్రులు వెంకట్రమణ, లక్ష్మీ దంపతులకు స్వయంగా అందజేశారు. అలాగే పెద్దపంజాణి మండలం రేషన్ డీలర్లు సైతం తమ వంతుగా రూ.25 వేల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు.
స్నేహితుల అండ.. ’సాక్షి’కి కృతజ్ఞతలు
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఎంతో కష్టపడి సీఏ చదువుతున్న రమ్యశ్రీ అకాల వ్యాధి బారిన పడటంతో ఆమె స్నేహితులు రాజారెడ్డి, ఆవుల హరిప్రసాద్ కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా ద్వారా విరాళాల సేకరణను వేగవంతం చేశారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు అండగా నిలిచిన దాతలకు, సమస్యను ప్రపంచానికి చాటిచెప్పిన ’సాక్షి’ పత్రికకు రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.


