ప్రపంచానికి షాక్.. భారత్‌ సహా విదేశీయులపై చైనా సీక్రెట్ మిషన్? | China Surveillance Network Follows Foreigners Data Leak | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి షాక్.. భారత్‌ సహా విదేశీయులపై చైనా సీక్రెట్ మిషన్?

Aug 3 2026 7:59 AM | Updated on Aug 3 2026 7:59 AM

China Surveillance Network Follows Foreigners Data Leak

బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్‌ యూ... ఈ మాట చైనా విషయంలో నిజమవుతోందా?. విదేశీయుల పాస్‌పోర్ట్ నుంచి ఆస్పత్రి రికార్డులు.. విమాన టికెట్లు నుంచి గ్యాస్ బిల్లుల వరకు వేలాది వ్యక్తిగత వివరాలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో చైనా భద్రపరిచినట్లు వెల్లడైంది. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. ఎవరిని కలిసినా.. ఆ సమాచారం అంతా ఒక రహస్య డేటాబేస్‌లో చేరుతుందనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వందలాది విదేశీయుల వ్యక్తిగత జీవితాలను అక్షరాలా ‘డిజిటల్ ఫైల్’గా మార్చిన ఈ నిఘా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలకు తెరతీస్తోంది. ఓ సైబర్ పరిశోధకుడు అనుకోకుండా కనిపెట్టిన ఈ రహస్య డేటాబేస్ ఇప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఈ డేటాబేస్‌లో భారతీయులతో పాటు వందలాది మంది విదేశీయుల సమాచారం ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ సంచలన విషయాన్ని మాజీ విదేశీ పాత్రికేయుడు, సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ గుర్తించారు. చైనాకు సంబంధించిన డిజిటల్ వ్యవస్థలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే వెబ్‌సైట్ కనిపించింది. వెబ్‌సైట్ తెరిచిన వెంటనే స్క్రీన్‌పై తన ఫొటో, పాస్‌పోర్ట్ నంబర్, ఒకప్పుడు చైనాలో ఉపయోగించిన మొబైల్ నంబర్ కనిపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. తనకు కనిపించిన సమాచారం నిజమైనదేనని, అది కేవలం నమూనా డేటా కాదని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం తనకు హాలీవుడ్ చిత్రం మైనారిటీ రిపోర్ట్ గుర్తు చేసిందని వ్యాఖ్యానించారు.

ఆ డేటాబేస్‌లో జాంగ్జియాకౌ నగరంతో సంబంధం ఉన్న 700 మందికి పైగా విదేశీయుల సమాచారం, మొత్తం దాదాపు 12 వేల రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. అందులో విదేశీ జర్నలిస్టులు, విద్యార్థులు, హాంకాంగ్, తైవాన్‌కు చెందిన వ్యక్తులు, పోలీసులు వెతుకుతున్న కొందరి వివరాలు ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, ఆ నగరానికి ఎప్పుడూ వెళ్లని కొంతమంది విదేశీయుల పేర్లు కూడా అందులో కనిపించాయి. ఈ డేటాబేస్‌లో కేవలం పేరు, ఫోన్ నంబర్, పాస్‌పోర్ట్ వివరాలు మాత్రమే కాదు.. ఇంటి చిరునామా, ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా నమోదైన సీసీటీవీ కదలికలు, ఆసుపత్రి సందర్శనలు, గ్యాస్ బిల్లుల చెల్లింపులు, విమానాలు, రైలు ప్రయాణాల వివరాలు, సీటు నంబర్లు, తరచూ వెళ్లే ప్రదేశాలు వంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం కూడా నమోదు చేసినట్లు వెల్లడైంది.

చైనాలో పలు యూనివర్సిటీలో చదువుతున్న భారత్, పాకిస్తాన్‌కు చెందిన విద్యార్థుల వివరాలు కూడా ఈ డేటాబేస్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారు ఏ కోర్సు చదువుతున్నారు, వారి మతం, వైవాహిక స్థితి, యూనివర్సిటీ గేటు ఎప్పుడు దాటారు, కెమెరాల్లో ఎప్పుడు నమోదయ్యారు వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పౌరులను "ఫైవ్ ఐస్ అలయన్స్" పేరుతో ఒకే విభాగంలో వర్గీకరించగా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్తాన్‌, సూడాన్ వంటి దేశాల వారిని "కీ కంట్రీస్"గా గుర్తించారు. హాంకాంగ్, తైవాన్ ప్రజలకు వేర్వేరు ఫోల్డర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

ఈ వెబ్‌సైట్ లాగిన్ చరిత్రలో అనేక పోలీసు స్టేషన్ల నుంచి యాక్సెస్ చేసిన ఆనవాళ్లు కనిపించాయని హోఫర్ తెలిపారు. దీంతో ఇది సాధారణ సాఫ్ట్‌వేర్ కాదని, అధికారిక నిఘా వ్యవస్థలో భాగమై ఉండే అవకాశం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ డేటాను చైనా పోలీసులు వాస్తవంగా ఎలా ఉపయోగించారనే విషయంపై స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. మరో ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఈ డేటాబేస్‌కు సంబంధించిన లాగిన్ పేజీలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ముందే నమోదు చేసి ఉండటాన్ని హోఫర్ గుర్తించారు. అంటే వందలాది మంది వ్యక్తిగత సమాచారం తగిన భద్రత లేకుండా ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడిందని ఆయన భావించారు. జనవరిలో ఈ సమాచారాన్ని భద్రపరిచిన ఆయన, మే నెల నాటికి ఆ వెబ్‌సైట్ పూర్తిగా అదృశ్యమైనట్లు తెలిపారు.

ఈ ఘటన చైనా డిజిటల్ నిఘా వ్యవస్థపై మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తింది. విదేశీయుల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఒకేచోట సమీకరించే సామర్థ్యం ఉన్న వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్దిష్ట డేటాబేస్‌ను చైనా అధికారులు అధికారికంగా ఎలా ఉపయోగించారనే విషయం ఇప్పటికీ స్పష్టంగా నిర్ధారించబడలేదు. ఈ వివరాలు ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన పరిశోధన ఆధారంగా వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement