అహ్మదాబాద్‌లో కలుద్దాం! | India to host 2030 Commonwealth Games | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌లో కలుద్దాం!

Aug 3 2026 2:39 AM | Updated on Aug 3 2026 2:41 AM

India to host 2030 Commonwealth Games

మహిళల జూడో 78 కేజీల కాంస్య పతక బౌట్‌లో ఇష్‌రూప్‌ (భారత్‌), కొరాలీ (కెనడా) పోరు

2030 కామన్వెల్త్‌ క్రీడలకు భారత్‌ ఆతిథ్యం

ముగిసిన గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌

39 పతకాలతో భారత్‌కు నాలుగో స్థానం

171 పతకాలతో ఆస్ట్రేలియా ‘టాప్‌’  

క్రీడాంశాలు తగ్గిపోయినా... పతకాల వేటలో మాత్రం భారత క్రీడాకారులు జోరు కొనసాగించారు. 2022 బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో సాధించిన ఓవరాల్‌ నాలుగో స్థానాన్ని 2026 గ్లాస్గో గేమ్స్‌లోనూ నిలబెట్టుకున్నారు. స్కాట్లాండ్‌లో 11 రోజులపాటు జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆదివారం తెరపడింది. 74 దేశాల నుంచి 2,729 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడ్డారు. ఆ్రస్టేలియా మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకొని 171 పతకాలతో అగ్రస్థానాన్ని అలంకరించింది. 110 పతకాలతో ఇంగ్లండ్‌ రెండో స్థానం దక్కించుకోగా... 62 పతకాలతో కెనడా మూడో స్థానాన్ని సంపాదించింది. 

39 పతకాలతో భారత్, స్కాట్లాండ్‌ సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. రెండు దేశాలు 13 చొప్పున స్వర్ణాలు గెలుపొందగా... స్కాట్లాండ్‌కంటే ఎక్కువ రజతాలు నెగ్గిన భారత్‌కు నాలుగో స్థానం ఖరారైంది. 2022 బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో భారత్‌ 61 పతకాలతో నాలుగో స్థానంలోనే నిలిచింది. బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాలు నెగ్గిన క్రీడాంశాలు బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్‌ టెన్నిస్, రెజ్లింగ్, స్క్వాష్, టి20 క్రికెట్‌ ఈసారి లేకపోవడంతో ఈసారి మనం గెలిచిన  పతకాల సంఖ్య తగ్గింది. తదుపరి 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం ఈ మెగా ఈవెంట్‌కు వేదిక కానుంది.  

గ్లాస్గో: ఆఖరి రోజును పతకంతో ముగించాలని ఆశించిన భారత బృందానికి నిరాశ ఎదురైంది. గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో చివరిరోజు భారత్‌ పతకం గెలవకుండానే ముగించింది. జూడోలో మహిళల 78 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ఇష్‌రూప్‌ నారంగ్‌ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. అయితే కాంస్య పతక బౌట్‌లో ఇష్‌రూప్‌ కెనడా ప్లేయర్‌ కొరాలీ గాడ్‌బౌట్‌ చేతిలో ఓడిపోయింది. ఇక ఆఖరి ఈవెంట్‌ సైక్లింగ్‌ 40 కిలోమీటర్ల పాయింట్స్‌ రేస్‌లో భారత ప్లేయర్లు హర్ష్ వీర్, దినేశ్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే వెనుదిరిగారు. వెరసి గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌ చివరిరోజు భారత్‌ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. 

ఓవరాల్‌గా భారత్‌ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 39 పతకాలతో నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. తద్వారా 2002 మాంచెస్టర్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వరుసగా ఏడో గేమ్స్‌లోనూ భారత్‌ టాప్‌–5లో నిలిచింది. మరోవైపు ఆ్రస్టేలియా 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో కలిపి 171 పతకాలతో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ 29 స్వర్ణాలు, 45 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి 110 పతకాలతో రెండో స్థానం దక్కించుకుంది. 

కెనడా 19 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 62 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. గ్లాస్గో గేమ్స్‌లో చివరి స్వర్ణం ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ దేశం ఖాతాలోకి వెళ్లింది. పురుషుల సైక్లింగ్‌ 40 కిలోమీటర్ల పాయింట్స్‌ రేస్‌ ఫైనల్లో ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ సైక్లిస్ట్‌ మాథ్యూ బోస్టాక్‌ పసిడి పతకం గెలిచాడు.   అర్ధరాత్రి గం. 1:30 నుంచి జరిగిన ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం గెలిచిన మహిళా బాక్సర్‌ జైస్మిన్‌ లంబోరియా ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించింది. తదుపరి 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌కు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరం ఆతిథ్యమివ్వనుంది.

45 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు. ఇందులో 25 దేశాలు కనీసం ఒక్క స్వర్ణ పతకమైనా గెలిచాయి.

5 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఒక్క పతకం నెగ్గని క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, లాన్‌ బౌల్స్‌

21 ఈసారి భారత్‌ గెలిచిన 39 పతకాల్లో 21 పతకాలు తొలిసారి ఈ క్రీడల్లో పాల్గొన్నవారు గెలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement