'అసంపూర్ణంగా భార‌తదేశ చిత్ర‌ప‌ఠం.. ఎందుకీ వివ‌క్ష‌?' | Lovlina Borgohain-Fury-Missing-NorthEast-On-India Map-Glasgow | Sakshi
Sakshi News home page

Lovlina Borgohain: 'అసంపూర్ణంగా భార‌తదేశ చిత్ర‌ప‌ఠం.. ఎందుకీ వివ‌క్ష‌?'

Aug 2 2026 3:44 PM | Updated on Aug 2 2026 4:00 PM

Lovlina Borgohain-Fury-Missing-NorthEast-On-India Map-Glasgow

Photo Credit: SAI Twitter

భార‌త మ‌హిళా బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ త‌న చ‌ర్య‌తో వార్త‌ల్లో నిలిచింది. గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్‌లో త‌మ‌కు ఇచ్చిన నాప్కిన్‌లో భార‌తదేశ చిత్ర‌ప‌ఠం అసంపూర్తిగా ఉండ‌డంపై ల‌వ్లీనా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. విష‌యంలోకి వెళితే.. గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న‌ కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త బాక్స‌ర్లు ప‌త‌కాలు సాధించిన సంతోషంలో ఆ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు గ్లాస్కోలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. 

అక్క‌డి రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ త‌మ హోట‌ల్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా ఆట‌గాళ్ల‌కు భార‌త చిత్ర‌ప‌ఠంతో త‌యారు చేసిన ప్ర‌త్యేక‌ నాప్కిన్‌ల‌ను అందించారు. అయితే నాప్కిన్‌ను సుశితంగా ప‌రిశీలించిన బాక్స‌ర్ ల‌వ్లీనా బొర్గొహైన్ నాప్కిన్‌పై భార‌త చిత్ర‌ప‌ఠం అసంపూర్ణంగా ఉండ‌డాన్ని గ‌మ‌నించింది. నాప్కిన్‌పై ముద్రించిన చిత్ర‌ప‌ఠంలో ఈశాన్య రాష్ట్రాల‌ను చేర్చ‌క‌పోవ‌డంపై ల‌వ్లీనా అసంతృప్తి వ్య‌క్తం చేసింది. 

అయితే ఇక్క‌డా ఎలాంటి గొడ‌వ చేయ‌కుండా ల‌వ్లీనా వ్య‌వ‌హ‌రించిన తీరు రెస్టారెంట్ మేనేజ్‌మెంట్‌కు బాగా న‌చ్చింది. నాప్కిన్‌పై ముద్రించిన భార‌త చిత్ర‌ప‌ఠంలో ఈశాన్య ప్రాంతాల‌ను విస్మ‌రించ‌డం త‌న‌కు బాధ క‌లిగించింద‌ని, తమపై ఎందుకీ వివక్ష అని న‌వ్వుతూనే పేర్కొంది. వెంట‌నే దానిని సవ‌రించాల‌ని రెస్టారెంట్ యజమానులను ల‌వ్లీనా అభ్యర్థిస్తూ కోరింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు స్వ‌ర్ణ వ‌ర్షం కురిపించారు. శనివారం మధ్యాహ్నం ప్రీతి పవార్‌ ఆరంభించిన గోల్డెన్‌ పంచ్‌.. రాత్రి అంకుశ్‌ పంఘల్‌ తెచ్చిన ఆఖరి బంగారు పతకం వరకూ కొనసాగింది. జాస్మిన్‌ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ ఘంగాస్‌ , అరుంధతి చౌదరి, సచిన్‌ సివాచ్‌ కూడా పసిడి పతకాలకు గురిపెట్టగా.. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గోహైన్‌, జాదుమణి సింగ్‌, నరేందర్‌ బెర్వాల్‌ రజతాలు తీసుకొచ్చారు. 

కామన్వెల్త్‌ చరిత్రలో భారత బాక్సర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2010, 2018, 2022 ఎడిషన్లలో మూడేసి స్వర్ణాలే ఇప్పటిదాకా రికార్డు కాగా.. గ్లాస్గోలో బాక్సర్లు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించారు. పారా అథ్లెట్‌ సోమన్‌ రాణా కూడా పసిడి పతకం అందుకోవడంతో మెగా గేమ్స్‌లో ఒకే రోజు 8 పసిడి పతకాలతో పండగ చేసుకున్న భారత్‌ పట్టికలో టాప్‌-5లోకి దూసుకొచ్చింది. ప్ర‌స్తుతం భార‌త్ 39 ప‌త‌కాలు (13 స్వ‌ర్ణం, 17 ర‌జ‌తం, 9 కాంస్యం) సాధించి ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

 

Read: గుండుతో దర్శనం.. హార్దిక్‌ పాండ్యా కొత్త లుక్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement