బాక్సింగ్లో భారత్కు 7 స్వర్ణాలు
మరో 3 రజతాలతో మొత్తం 10 పతకాలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు
భారత బాక్సింగ్ బృందం కామన్వెల్త్ గేమ్స్లో పదునైన పంచ్లతో విరుచుకుపడింది...అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో పసిడి వేటలో ఒకరితో మరొకరు పోటీ పడినట్లుగా మన బాక్సర్లు చెలరేగిపోయారు... ఫలితంగా ఒకే రోజు మన ఖాతాలో 7 స్వర్ణాలు చేరాయి. ఫైనల్లో ఓటమితో మరో 3 రజతాలు కూడా దక్కడంతో మొత్తంగా 10 పతకాలకు బాక్సింగ్ మనకు అందించింది.
జైస్మీన్, సాక్షి, ప్రీతి, ప్రియ, అరుంధతి, అంకుశ్, సచిన్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా...జాదూమణి సింగ్, లవ్లీనా బొర్గొహైన్, నరేందర్ రజతాలు సాధించారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో 7 పతకాలు గెలుచుకున్న భారత్...ఇప్పుడు దానిని అధిగమించింది. మొత్తంగా శుక్ర, శనివారాలు కలిపి వేర్వేరు ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో తమ స్థాయిని ప్రదర్శించింది. నేడు పోటీలకు చివరి రోజు.
జైస్మీన్ లంబోరియా (57 కేజీలు): ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జైస్మీన్ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందుకుంది. ఫైనల్లో జైస్మీన్ 5–0తో మికెలా వాల్ష్ (నార్తర్న్ ఐలాండ్)పై ఘన విజయం సాధించింది. 2022 క్రీడల్లో ఆమె కాంస్యం సాధించింది.

సాక్షి చౌదరి (51 కేజీలు): ఫైనల్లో సాక్షి 5–0తో రూబీ వైట్ (ఇంగ్లండ్)ను ఓడించింది. గత కొంత కాలంగా పలు మార్లు కెరీర్లో గాయాలతో ఇబ్బంది పడి కోలుకున్న సాక్షి కెరీర్లో ఇది కీలక విజయం. ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సమయంలో విరాట్ కోహ్లి ఫౌండేషన్ మూడేళ్ల పాటు సాక్షికి అండగా నిలవడంతో ఆమె పట్టుదలగా పోటీలో నిలవగలిగింది.

అరుంధతి చౌదరి (70 కేజీలు): ఫైనల్లో అరుంధతి 5–0తో షాంటెల్ రీడ్ (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలుచుకుంది. రాజస్తాన్కు చెందిన అరుంధతి గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించింది.

ప్రియా ఘంఘాస్ (60 కేజీలు): ఫైనల్లో ప్రియ 4–1 తేడాతో మేరీ అల్ అహ్మదీ (కెనడా)పై గెలుపొందింది. 
సచిన్ సివాచ్ (60 కేజీ): హోరాహోరీగా సాగిన ఫైనల్లో సచిన్ 3–2తో ట్రైగెన్ మార్నింగ్ (నమీబియా)ను ఓడించి స్వర్ణం గెలిచాడు. అతనికి కామన్వెల్త్ పోటీల్లో ఇదే తొలి పతకం కావడం విశేషం.
అంకుశ్ పంఘాల్ (80 కేజీలు): ఫైనల్లో అంకుశ్ 4–1 స్కోరుతో దిమెజె షిటు (ఇంగ్లండ్)ను ఓడించి పసిడి గెలిచాడు.
గుల్వీర్కు కాంస్యం
భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో ‘డబుల్’ సాధించాడు. ఈ పోటీల్లో ఇప్పటికే 10,000 మీటర్ల పరుగులో రజతం నెగ్గిన అతను శనివారం 5,000 మీటర్ల పరుగులతో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ పరుగును గుల్వీర్ 13 నిమిషాల 24.95 సెకన్లలో పూర్తి చేశాడు.
లవ్లీనాకు నిరాశ...
ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్కు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం లభించలేదు. మహిళల 75 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లో 1–4తో ఎమా స్యూ గ్రీన్ట్రీ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. పురుషుల 55 కేజీల కేటగిరీ ఫైనల్లో జాదూమణి సింగ్ 0–5తో జై డిక్సన్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల 90+ కేటగిరీలో నరేందర్ బెర్వాల్ 0–5తో డామర్ థామస్ (ఇంగ్లండ్) చేతిలో పరాజయంపాలు కావడం రజతం మాత్రమే దక్కింది.
పవర్ ఫుల్ ప్రీతి
శనివారం బాక్సింగ్లో ప్రీతి పవార్ భారత్కు తొలి స్వర్ణాన్ని అందించింది. 54 కేజీల ఫైనల్లో ఆమె 5–0 స్కోరుతో స్కార్లెట్ డెల్గాడో (కెనడా)ను చిత్తు చేసింది. తొలి రౌండ్నుంచి ప్రత్యర్థిపై ప్రీతి చెలరేగింది. ఐదుగురూ జడ్జీలు ఆమెకు అనుకూలంగా 10–9 పాయింట్లు ఇచ్చారు. తర్వాతి రెండు రౌండ్లలో కూడా ఇదే సరళి కొనసాగి 10–9, 10–9తో ప్రీతి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

చివరకు 30–27 పాయింట్లతో ఆమె ఏకపక్ష విజయాన్ని అందుకుంది. హరియాణాలోని భివానికి చెందిన 22 ఏళ్ల ప్రీతికి కామన్వెల్త్ క్రీడల్లో ఇదే తొలి పతకం. 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన ఆమె గత ఏడాది వరల్డ్ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలుచుకుంది. బాంటమ్ వెయిట్ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న ప్రీతి ప్రస్తుతం భారత ఆర్మీలో నాయబ్ సుబేదార్ హోదాలో పని చేస్తోంది.


