రజతంతో నీరజ్‌ ‘సమ్‌’తృప్తి! | Neeraj Chopra shines with silver medal at Commonwealth Games | Sakshi
Sakshi News home page

రజతంతో నీరజ్‌ ‘సమ్‌’తృప్తి!

Aug 2 2026 3:55 AM | Updated on Aug 2 2026 3:55 AM

Neeraj Chopra shines with silver medal at Commonwealth Games

కాంస్యం గెలుచుకున్న యశ్వీర్‌ 

శ్రీలంక అథ్లెట్‌ పతిరగేకు స్వర్ణం

గ్లాస్గో: భారత స్టార్‌ అథ్లెట్, జావెలియన్‌ నీరజ్‌ చోప్రా కామన్వెల్త్‌ క్రీడల్లో రజత పతకంతో మెరిశాడు. రెండు ఒలింపిక్‌ పతకాల విజేత అయిన నీరజ్‌ స్థాయి, అంచనాలతో పోలిస్తే రెండో స్థానం నిరాశ కలిగించేదే అయినా...సుదీర్ఘ కాలం గాయంతో బాధపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తీరును చూస్తే రజతం సంతృప్తికర ఫలితంగానే చెప్పవచ్చు. క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ ఆశించిన విధంగా విసరలేకపోయిన నీరజ్‌ అసలు పోరులో సత్తా చాటాడు. తన రెండో ప్రయత్నంలో బల్లెంను 85.83 మీటర్లు విసిరిన నీరజ్‌ ఖాతాలో సిల్వర్‌ మెడల్‌ చేరింది.  

తన మొదటి ప్రయత్నంలో 80.97 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్‌... రెండో ప్రయత్నంలో విసిరిన దూరం పతకాన్ని అందించింది మూడు, నాలుగు ప్రయత్నాల్లో అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన నీరజ్‌...తర్వాతి రెండు ప్రయత్నాలనూ ఫౌల్‌గా ముగించాడు. ఈ ఈవెంట్‌లో కాంస్యం కూడా భారత ఆటగాడే గెలుచుకోవడం విశేషం. యశ్వీర్‌ సింగ్‌ (85.41 మీ.) తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రీలంక జావెలిన్‌ త్రోయర్‌ రుమేశ్‌ తరంగ పతిరగేకు స్వర్ణ పతకం లభించింది. 

పతిరగే విసిరిన జావెలియన్‌ 89.75 మీటర్లు దూసుకుపోయింది. ఈ సీజన్‌లో తాను పాల్గొన్న ఎనిమిది ఈవెంట్లలో పతిరగే ఏడు సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. యశ్వీర్‌ తొలి ఐదు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్‌ సహా తడబాటుకు గురైనా...చివరి ప్రయత్నంలో నమోదు చేసిన దూరం అతనికి కాంస్యాన్ని అందించింది. 12 మంది పాల్గొన్న ఫైనల్‌లో మరో భారత ఆటగాడు రోహిత్‌ (81.56 మీ.) ఏడో స్థానంతో ముగించగా... పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌) 9వ స్థానానికే పరిమితమయ్యాడు.

‘ఫిట్‌నెస్‌పరంగా నేను ఇంకా కోలుకునే దశలోనే ఉన్నాను. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు సంతృప్తిగా ఉన్నా. ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో నేను అనుకున్నట్లుగా జావెలిన్‌ విసరలేకపోయా. కానీ ఇలాంటి చోటా పతకం గెలవడం ఆనందాన్నిచ్చింది.  ఆసియా క్రీడలకు ముందు నా ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉంది’ అని నీరజ్‌ స్పందించాడు.  

తండ్రి శిక్షణలో...
భారత జావెలిన్‌లో నీరజ్‌ చోప్రా శకం మొదలైన తర్వాత అతని నీడలో మరో ఆటగాడి ప్రదర్శనకు సహజంగానే గుర్తింపు లభించడం లేదు. ఇలాంటి స్థితిలో యశ్వీర్‌ గెలిచిన కాంస్యం విలువ ఎంతో అమూల్యం. నిజానికి 2021లో నీరజ్‌ ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలవడానికి కొన్నాళ్ల క్రితం నెలకొల్పిన జూనియర్‌ ఫెడరేషన్‌ మీట్‌ రికార్డును బద్దలు కొట్టడంతోనే యశ్వీర్‌ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇంత కాలానికి అతని కష్టానికి ఫలితం లభించింది. రాజస్తాన్‌కు చెందిన యశ్వీర్‌కు అతని తండ్రి, మాజీ జావెలిన్‌ త్రోయర్‌ అయిన రాయ్‌ సింగ్‌ కోచ్‌గా మారి మార్గనిర్దేశనం చేశాడు. 

జాతీయ స్థాయిలో, రైల్వే చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు గెలుచుకొని స్పోర్ట్‌ కోటాలోనే ఉద్యోగం అందుకున్న రాయ్‌ సింగ్‌ కోచింగ్‌లో కూడా ఎన్‌ఐఎస్‌ డిప్లొమా హోల్డర్‌. ఈ అనుభవాన్నంతా అతను తన కొడుకును తీర్చిదిద్దేందుకు ఉపయోగించాడు. తాను పెద్ద స్థాయిలో విజయాలు సాధించలేదని, యశ్వీర్‌ కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో పతకాలు సాధించాలని కలగన్న రాయ్‌ సింగ్‌ అన్ని రకాలుగా శ్రమించి శిక్షణ అందించాడు. 

ఈవెంట్‌కు ముందు కొడుకును ప్రోత్సహిస్తూ ‘జీవితంలో ఇదే అతి పెద్ద ప్రశ్నగా భావించి సరైన రీతిలో సమాధానం ఇవ్వు. ఇక్కడ పూర్తి సామర్థ్యంతో సత్తా చాటు. ఇక్కడ గెలిస్తే నీ జీవితం మారిపోతుంది. ఎంత బాగా ఆడగలవో ఆడు’ అంటూ ఈవెంట్‌కు ముందు స్ఫూర్తి నింపిన తండ్రికి యశ్వీర్‌ పతకాన్ని కానుకగా ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement