'ప‌త‌కాలు చూసి మురిసిపోవ‌ద్దు.. ముందుంది ముసళ్ల పండ‌గ‌!’ | PT-Usha-Says-Avoid Celebrations-Big Challenge Ahead-Asian Games 2026 | Sakshi
Sakshi News home page

'ప‌త‌కాలు చూసి మురిసిపోవ‌ద్దు.. ముందుంది ముసళ్ల పండ‌గ‌!’

Aug 2 2026 6:58 PM | Updated on Aug 2 2026 8:30 PM

PT-Usha-Says-Avoid Celebrations-Big Challenge Ahead-Asian Games 2026

Photo Credit: SAI Twitter

గ్లాస్కో వేదిక‌గా జ‌రుగుతున్న‌ కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ ప‌త‌కాల పంట పండిస్తున్న వేళ ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ పీటీ ఉష ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచార‌ని ఆమె కొనియాడారు. బాక్సింగ్‌లో ఏడు స్వ‌ర్ణాలు రావ‌డం నిజంగా గొప్ప విష‌య‌మ‌న్నారు.

అయితే కామ‌న్‌వెల్త్‌లో సాధించిన ప‌త‌కాలను చూసి మురిసిపోవ‌ద్ద‌ని, ఆసియా గేమ్స్ రూపంలో మ‌న ముంగిట అస‌లైన స‌వాల్ ఉంద‌ని పేర్కొన్నారు. కామ‌న్‌వెల్త్ ముగిసిన కొద్ద రోజుల‌కే ఆసియా గేమ్స్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అథ్లెట్లంతా ఆ క్రీడ‌ల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. 

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొన‌ని చైనా, జ‌పాన్‌లు ఇక్క‌డ పోటీలో ఉంటాయ‌ని, కాబ‌ట్టి భార‌త్ ప‌త‌కాల కోసం గ‌ట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సున్నితంగా హెచ్చ‌రించారు. మ‌న అథ్లెట్లంతా కామ‌న్‌వెల్త్‌లో చూపిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆసియా గేమ్స్‌లోనూ కంటిన్యూ చేసి దేశానికి వీలైనన్ని ఎక్కువ ప‌త‌కాలు తీసుకురావాల‌ని తాను ఆకాంక్షిస్తున్న‌ట్లు పీటీ ఉష వెల్ల‌డించారు. 

అయితే పీటీ ఉష వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డిచింది. ఒలింపిక్స్‌లో లేదా కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో దేశానికి ఒక్క ప‌త‌కం కూడా తీసుకురాని వ్య‌క్తి ఇలా మాట్లాడ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని కొంత‌మంది కామెంట్లు చేయ‌డం క‌నిపించింది. ఈసారి కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త్ 39 ప‌త‌కాలు కొల్ల‌గొట్టింది. 

మ‌న‌కు అచ్చొచ్చిన రెజ్లింగ్‌, షూటింగ్ స‌హా చాలా క్రీడ‌ల‌ను ఈసారి కామ‌న్‌వెల్త్ గేమ్స్ నుంచి తొల‌గించ‌డం భార‌త్‌పై గ‌ట్టి ప్ర‌భావం చూపింది. అయిన‌ప్ప‌టికీ మ‌న అథ్లెట్లు మంచి ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బ‌రిచారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టారు. ఏడు స్వ‌ర్ణాలు, మూడు ర‌జతాల‌తో మ‌న బాక్స‌ర్ల త‌మ పంచ్ ప‌వ‌ర్ చూపించారు. 

మొత్తంగా భార‌త్ సాధించిన 39 ప‌త‌కాల్లో 13 స్వ‌ర్ణాలు, 17 ర‌జ‌తాలు, 9 కాంస్యాలున్నాయి. ఇక ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. ఆదివారం చివ‌రి రోజు కావ‌డం, భార‌త అథ్లెట్ల‌కు మెడ‌ల్ ఈవెంట్స్ ఉండ‌డంతో, 40 ప‌త‌కాల మార్క్‌ను అందుకుంటుందా అన్న‌ది చూడాలి.

 

Read: ‘అతడిని ఎంపిక చేయబోం.. రిటైరవ్వడమే మంచిది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement