Photo Credit: BCCI Twitter
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యక్తిగత గోప్యత, హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యువరాజ్ సింగ్ వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కలిగించవద్దని స్పష్టంచేసింది. యువరాజ్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటోలు, గొంతును వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని థర్డ్ పార్టీలను నియంత్రిస్తూ జస్టిస్ జ్యోతి సింగ్ తీర్పునిచ్చారు.
తన వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా అనుమతి లేకుండా తన పేరును ఉపయోగించి వస్తువులను అనధికారికంగా విక్రయించడమే కాకుండా, పలు సోషల్ మీడియా ఖాతాలు తనను కల్పిత, అవాస్తవ దృశ్యాలలో చూపిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన చిత్రాలు, వీడియోలను ప్రచురిస్తున్నారని, ఇవి తన ప్రతిష్టకు, సద్భావనకు నష్టం కలిగిస్తున్నాయని యువరాజ్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో ఇతర క్రీడాకారులపై దాడి చేస్తున్నట్లు, మతపరమైన భావాలను దెబ్బతీసేలా, అసభ్యకరమైన భాషతో కూడిన డీప్ఫేక్ కంటెంట్ను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని యువరాజ్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జస్టిస్ జ్యోతిసింగ్ స్పందిస్తూ.. ‘17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో దేశానికి యువరాజ్ ప్రాతినిధ్యం వహించాడు.
దేశం తరఫున ఆడుతూ ఎన్నో ఘనతలు సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అతడి వ్యక్తిత్వ, గోప్యతా హక్కులకు భంగం కలిగిస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. యువరాజ్ ఆమోదం లేకుండా రూపొందించిన అభ్యంతరకర పోస్టులు, వీడియోలు తక్షణమే తొలగించాలి’ అని తెలిపాడు.
చదవండి: 'పతకాలు చూసి మురిసిపోవద్దు.. ముందుంది ముసళ్ల పండగ!’


