ముంబై: నటులు ఆర్ మాధవన్ (మ్యాడీ),వివేక్ ఓబెరాయ్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శలు గుప్పించారు. భారత్పై అంత ప్రేముంటే విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్లో ప్రతీదీ అద్భుతంగా మార్చిందని భావిస్తే వాళ్లెందుకు విదేశాల్లో ఉంటున్నారని అన్నారు.
ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. మోదీ బయోపిక్లో నటించి, ఆయన పాత్రను పోషించిన వివేక్ ఓబెరాయ్ కూడా ఇప్పుడు దుబాయ్లోనే నివసిస్తున్నారు. పీఎం మోదీని ప్రశంసించిన ఆర్ మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్లోనే ఉంటున్నారు.
మీకు భారత్పై అంత ప్రేమ ఉంటే పీఎం మోదీని అంతగా అభిమానిస్తే, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే.. మరి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్లో ఎందుకు నివసిస్తున్నారు? అని థాకరే నిలదీశారు.
వారు ఇక్కడికి వస్తారు, ప్రభుత్వం స్పాన్సర్ చేసే ‘ధురంధర్’లాంటి సినిమాల్లో నటిస్తారు. ఆ తర్వాత మళ్లీ దుబాయ్కి వెళ్లిపోతారు’ అని ఆయన ఆరోపించారు. అయితే, తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాను దుబాయ్కి మారినట్లు ఆర్ మాధవన్ గతంలో పేర్కొనగా, తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దుబాయ్ వెళ్లినట్లు వివేక్ ఓబెరాయ్ చెప్పారు.


