సాక్షి,ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న ఓ మైనర్ బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో తన కుమార్తెను క్షమించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పూర్తిగా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. నా కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ప్రధాని కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో ఆమె మళ్లీ జన్మించినట్లైంది’అని అన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాలిక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గత వారం నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో బాలిక పేరు రుచికా సింగ్, వయస్సు 25గా పొందుపరిచారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వివరాలు తప్పుగా ఉన్నాయని ఆమె తల్లి మోదీకి వివరించారు.
మోదీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది. మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలనుకునే వారికి సులభ లక్ష్యాలుగా మారతారని పేర్కొంటూ, వారిపై సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధానమంత్రిని కోరారు.
విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై చేసిన దూషణాత్మక నినాదాల విషయంలో, ప్రధాని మోదీ గత శుక్రవారం సంయమనం పాటించాలని, క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆయన దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవు అని పేర్కొంటూ వారిని శిక్షించడం కాకుండా సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలని కోరారు.
వారు తప్పుదారి పట్టిన పిల్లలు. వారికి సరైన మార్గాన్ని చూపించడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులేమీ మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా నా మాటను అంగీకరించాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.
తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై బాలిక ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసన సమయంలో ఇతరుల ప్రభావంతోనే తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడానని ఆమె పేర్కొన్నారు. నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. నేను చేసిన పని క్షమించరానిది. నేను అభ్యంతరకరమైన మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆమె చెప్పింది.


