ఉత్తరాంధ్రలో జగన్‌ వెంటే జనం.. కూటమిలో కలవరం? | Massive Public Support for YS Jagan Srikakulam Tour | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో జగన్‌ వెంటే జనం.. కూటమిలో కలవరం?

Aug 3 2026 1:16 PM | Updated on Aug 3 2026 2:29 PM

 Massive Public Support for YS Jagan Srikakulam Tour

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్‌ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్  వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. 

విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్‌  కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. 

అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు  పెద్ద ఎత్తున  వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన  కృషిని వారు గుర్తు చేసుకున్నారు. 

కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్‌లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా  అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.

మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన  మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్‌సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు  కుమారుడు ఆరవ్   బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. 

ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు  తారుమారు యత్నం   చేశారంటూ కేసు పెట్టి జైలులో  నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్  వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన  ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక,  మంత్రి  పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో  ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే  ప్రకాశం జిల్లాలో ఒక  ఘటనలో  ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని  ఉదహరించారు.

అంతేకాక విశాఖలో వైఎస్సార్‌సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు  జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.

లేదా అసలు  కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్‌సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది.  ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు  ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్‌సీపీ నేతలు  గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు  పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.

పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.

ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్‌కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్‌తో అప్పలరాజుతో ములాఖత్‌కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement