సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు.
ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.
‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.


