సాక్షి,ఢిల్లీ: PKOC-2 డిప్సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం చాలా సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు (సోమవారం) ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వులు ఉన్నాయని తద్వారా సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
PKOC-2 కోల్బ్లాక్ వల్ల దాదాపు 2వేల మందికి ఉద్యోగకల్పన జరుగుతుందని ఇక్కడ దొరికే G-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా.. మొత్తం రూ.43వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందని పేర్కొన్నారు. తదనుగునంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుందని తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతోపాటుగా.. సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నైని, తాడిచర్ల-2, PKOC-2 డిప్సైడ్ బ్లాక్ వల్ల కలిగే ఉపయోగాలు
* సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వ్స్ సమకూరుతాయి.
* 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది.
* సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయవచ్చు.
* ఈ 3 బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.


