బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామంగా నిలిచిన బంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్లో ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు చెందిన నియోజకవర్గంలోనే జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.
అయితే, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరు. దీనికి బంకిపూర్ ఫలితం మరో నిరూపన. ప్రజలు తమ ఓటుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించి అహంకారపూరిత పాలన కొనసాగిస్తే తగిన సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మంత్రి గట్టిగా చెప్పుకొచ్చారు.
ఇటీవల ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రస్తావించిన మంత్రి.. దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందని, అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందనే భావన బలపడుతోందని, అదే భావోద్వేగం బంకిపూర్ ఉపఎన్నిక ఫలితంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.
అలాగే, బంకిపూర్ తీర్పు కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక. దీంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూసే రాజకీయాలకు దేశ ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని, బంకిపూర్లో బీజేపీ కంచుకోట బద్దలవడం దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.


