కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్కు.. మరో చాన్స్ దక్కనుందా?. స్వరాష్ట్రంలో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు బిగ్చాన్స్ దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలానికి 2024 సంబల్పూర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 1,19,836 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితేశ్ గంగా దేవ్ కేవలం 9,162 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు. ఐదేళ్ల వ్యవధిలో సంబల్పూర్లో బీజేపీ బలం ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సంస్థాగత కృషి కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి. చాలా కాలం ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు.
మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒడిశాకు తిరిగి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ పరిణామమే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం ఓ నేతకు ఇచ్చిన స్వాగతమేనా? లేదంటే భవిష్యత్లో కీలక బాధ్యతలకు సంకేతమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరో అవకాశం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
రాజీనామా.. అవకాశంగా మారిందా?
NEET వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయనకు మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని.. అటు ఆందోళనకారులు, ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయనకు మరో అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. సాధారణంగా ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ప్రతికూల పరిణామంగానే భావిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
రాజీనామా తర్వాత ఆయనకు లభించిన స్వాగతం, పార్టీ నేతల బహిరంగ మద్దతు.. ఆయన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రజల్లో “ఒడిశాకు చెందిన కీలక నేత కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు” అనే భావన కూడా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
అయితే మరోవైపు.. NEET వివాదం ప్రభావం పూర్తిగా తగ్గిందా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న అభిప్రాయం ఎలా ఉందన్నది భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది.
ఒడిశాలో అసలు బలం ఎంత?
జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్కు ఒడిశా రాజకీయాలపై పట్టు లేదనే వాదనకు ఆయన రాజకీయ ప్రయాణమే సమాధానంగా నిలుస్తుంది. విద్యార్థి దశలో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీ ఒక చిన్న శక్తిగా ఉన్న సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి.
ప్రత్యేకంగా పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తల నెట్వర్క్ పెంచడం, ఎన్నికల వ్యూహాల్లో ఆయన పాత్ర ఉందనే గుర్తింపు ఉంది. 2024లో సంబల్పూర్లో వచ్చిన భారీ విజయం కూడా ఆయనకు ఉన్న క్షేత్రస్థాయి అనుబంధానికి నిదర్శనంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.
అయితే ఆయన బలం ఎక్కువగా సంస్థాగత రాజకీయాలు, వ్యూహ రచన, పార్టీ నాయకులతో సమన్వయం చేయడంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఇమేజ్ను మాత్రం మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
సీఎం రేసులో మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీని వెనుక గిరిజన ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.
ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. ఆయనకు ఉన్న అనుభవం, ఢిల్లీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వెంటనే సీఎం మార్పు చేయడం మాత్రం పార్టీకి అంత సులభమైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.
ఎందుకంటే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడంతో ఆయనను మార్చడం మరో రాజకీయ సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
బీజేపీలో కొత్త సమీకరణాలు?
ధర్మేంద్ర ప్రధాన్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఒడిశా బీజేపీలో అంతర్గత సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అపరాజిత సారంగి, బైజయంత్ పాండా, మన్మోహన్ సామల్ వంటి నేతలు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రధాన్ పాత్రను పెంచే విషయంలో పార్టీ అధిష్ఠానం సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్కు పార్టీలో ఉన్న అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు ఆయనకు ప్రత్యేక బలంగా మారుతున్నాయి.
ముందున్న దారులు ఏంటి?
ధర్మేంద్ర ప్రధాన్ ముందు ప్రధానంగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలకమైన సంస్థాగత బాధ్యతలు చేపట్టడం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం. రెండోది.. ఒడిశా రాజకీయాల్లోకి మరింత చురుగ్గా ప్రవేశించి రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయడం.
వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా.. భవిష్యత్లో ఆయనకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవైపు ఆయనపై వచ్చిన విమర్శలకు కారణమైనప్పటికీ.. మరోవైపు ఒడిశాలో ఆయన రాజకీయ బలాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి పాత్ర ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.


