బీజేపీకి బిగ్‌ టెస్ట్‌.. మరికాసేపట్లో ఫలితాలు! | BJPs Big Test: Bypoll Results to Reveal Gen Z Mood After Student Protests | Sakshi
Sakshi News home page

బీజేపీకి బిగ్‌ టెస్ట్‌.. మరికాసేపట్లో ఫలితాలు!

Aug 3 2026 7:35 AM | Updated on Aug 3 2026 7:37 AM

BJPs Big Test: Bypoll Results to Reveal Gen Z Mood After Student Protests

దేశవ్యాప్తంగా పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు హోరెత్తిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాలు.. బిహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదంటే బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది ఈ ఫలితాలతో తేలనుంది.

మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఉప ఎన్నికలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కీలకంగా మారాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

బంకీపూర్‌.. బీజేపీ కంచుకోటలో ఆసక్తికర పోరు
బిహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్‌ కుమార్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చివరి నిమిషంలో యువ మోర్చా నేత నీరజ్‌ కుమార్‌ సిన్హాను బరిలోకి దింపింది.

ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెరిగిందనే సంకేతంగా ప్రచారం చేశాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. కుల, మతాలకు అతీతంగా తమ అభ్యర్థికి మద్దతు లభించిందని చెబుతూ అనూహ్య ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.

దాతియా.. బీజేపీ అంతర్గత అసంతృప్తికి పరీక్ష
మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గం కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశుతోష్‌ తివారీ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్‌ సింగ్‌ పోటీ చేశారు.

అయితే ఈ ఎన్నికలో అసలు చర్చ బీజేపీ అంతర్గత రాజకీయాలపైనే సాగింది. మాజీ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రాకు ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆయన వరుసగా మూడు సార్లు దాతియా నుంచి గెలిచారు. ఈసారి అభ్యర్థి మార్పుపై నరోత్తమ్‌ మిశ్రా వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆయన అనుచరులు నిరసనలు కూడా చేపట్టారు. ఈ అంతర్గత విభేదాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

మంజల్‌పూర్‌.. గుజరాత్‌లో బీజేపీ ఆధిపత్యానికి పరీక్ష
గుజరాత్‌లోని మంజల్‌పూర్‌ నియోజకవర్గం బీజేపీకి మరో కీలక పరీక్షగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్‌భాయ్‌ నరేంద్రభాయ్‌ పటేల్‌ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరఫున మాజీ వడోదరా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ సతీష్‌ గోవింద్‌భాయ్‌ పటేల్‌ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి భిఖాభాయ్‌ రబారీ బరిలో నిలిచారు. గుజరాత్‌లో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికలో కీలకంగా మారాయి.

యువ ఓటర్ల తీర్పు ఏంటి?
ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా అందరి దృష్టి యువ ఓటర్ల తీర్పుపైనే ఉంది. పేపర్‌ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఆగ్రహం ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందా? లేక సాధారణ రాజకీయ అంశాలే ఆధిపత్యం చెలాయిస్తాయా? అన్నది ఫలితాల తర్వాత స్పష్టమవుతుంది.

అయితే మూడు స్థానాల ఫలితాలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో లేకపోయినా.. ప్రజల మూడ్‌, ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వనున్నాయి. బీజేపీ కంచుకోటలను కాపాడుకుంటుందా? లేదంటే విద్యార్థి నిరసనల ప్రభావం ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా? మరికాసేపట్లో వెలువడే ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement