స్టార్ హీరోయిన్ త్రిష పేరుతో ఆమె అభిమానులు మధురైలో త్రిష ఛారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయిపోయింది. సోమవారం ఈ ఫౌండేషన్ ఆవిర్భావం సందర్భంగా త్రిష, రాజకీయాల్లోకి రావాలంటూ మధురై నగరమంతా భారీ పోస్టర్స్ కనిపించాయి. తమిళనాడు వీరమంగై వేలు నాచియార్ టైటిల్తో త్రిషని సంభోధించారు. స్వాతంత్య్ర పోరాట యోధురాలు వేలు నాచియర్ ఫొటోతో పాటు త్రిషని ఇందులో ముద్రించారు.
(ఇదీ చదవండి: నేను చేసిన పనికి కేసు పెట్టాలనుకున్నారు: విజయ్ కొడుకు జేసన్)
తమిళనాడు సంఘాల చరిత్రలోనే తొలిసారిగా తమ ప్రియమైన సోదరి త్రిష పేరు మీద ఏర్పాటైన మొదటి గుర్తింపు పొందిన సంఘం ఇదే అని పోస్టర్లలో పేర్కొనడం విశేషం. ఏ రాజకీయ పార్టీ ప్రారంభానికైనా మొదటి స్థానం మధురై నగరానిదే. అది కూడా మధురై మీనాక్షి అమ్మవారి దివ్య ఆశీస్సులతో.. అని నినాదాలతో ఆమెని రాజకీయాల్లోకి రావాలని అభిమానులు పిలుపునిచ్చారు.
ఆధ్యాత్మికమైనా, రాజకీయమైనా మధురైలో వెలిసే భారీ పోస్టర్లు తమిళనాడులో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తుంటాయి. ప్రస్తుతం త్రిష బహిరంగ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటం, మధురైలో ఈ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రాజకీయాల్లోకి రావాలని కోరడం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రీసెంట్గా 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన త్రిష చేతిలో ప్రస్తుతం విశ్వంభర, రామ్ అనే మలయాళ మూవీ ఉంది. మరి ఇవి పూర్తయినా తర్వాత ఏమైనా రాజకీయాలపై దృష్టి సారిస్తుందా లేదంటే నటిగా కొనసాగుతుందా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: త్రిష పేరుతో సీఎం విజయ్పై దారుణమైన కామెంట్స్)


