వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ సినిమా ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్ల పాక గాంధీ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా స్నేహితులతో కలిసి ఓ పెళ్లికి వెళుతున్నప్పుడు అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. అక్కడ కొరియన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ, వాళ్ల సంస్కృతికి తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉండటం ఆసక్తిగా అనిపించింది.
అనంతపురంలోని ఒక అబ్బాయిని ఒక కొరియన్ ఆత్మ ఆవహిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘కొరియన్ కనకరాజు’ కథ రాసుకున్నాను. కనకరాజు పాత్రతో పాటుగా కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్కు వరుణ్ కరెక్ట్గా సరిపోయారు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిగా రితికా కనిపిస్తుంది. ఆమెకు కొరియన్ భాష కూడా తెలుసు.
కొరియాలో చిత్రీకరణ కాస్త ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. మా నాన్నగారి కథతో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా కామెడీ థ్రిల్లర్ జానర్లో మరో సినిమా చేయనున్నాను’’ అని తెలి పారు.


