తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా టి. గోపీచంద్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. గోపీచంద్, స్నేహ హీరో హీరోయిన్లుగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎమ్.నాగేశ్వర రావు నిర్మించిన చిత్రం ‘తొలివలపు’. 2001 ఆగస్టు 3న ఈ సినిమా విడుదలైంది. నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోపీచంద్ సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘‘మా నాన్నగారి (దివంగత దర్శక–నిర్మాత టి.కృష్ణ) ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతున్నాను.
నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి, అవకాశాలు కల్పించిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సహనటులు, సాంకేతిక నిపుణులుకు థ్యాంక్స్. నా కెరీర్లోని ప్రతి దశలో నా వెంటే నిలబడి ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని మరపురానిదిగా మార్చిన అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణను జీవితాంతం నా హృదయంలో దాచుకుంటాను.
ఈ 25 ఏళ్ల ప్రయాణం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. ఇకపై కూడా మరింత కష్టపడి మంచి కథలు, మంచి పాత్రలతో మీ(ప్రేక్షకులు, అభిమానులను ఉద్దేశిస్తూ..) ముందుకు వస్తానని మాట ఇస్తున్నాను. త్వరలో ‘భరతవర్ష’, ‘సింగా’ సినిమాలతో పాటు మరిన్ని మూవీస్ ద్వారా థియేటర్లలో కలుద్దాం’’ అన్నది ఆ ప్రకటన సారాంశం.


