ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రష్మిక మందన్నా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ డ్యాన్స్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఇటీవల రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు రష్మిక.
ఈ ప్రమాదంపై తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారామె. ‘‘గాయాలు కావడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికీ తెలియకూడదనుకున్నప్పటికీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. కాలుపైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. నేను చేస్తున్న సినిమాల్లో ‘మైసా’ అత్యంత కష్టమైన సినిమా.
నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను. ఈ టైమ్లో మానసికంగా బలంగా ఉండటానికి పజిల్స్ పూర్తి చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. అదేవిధంగా ఫిట్నెస్ దెబ్బతినకుండా, బరువు పెరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తాను’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు.


