త్రిష.. పేరుకు తమిళ హీరోయినే కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ ఇంటి అమ్మాయిగానే చూసుకుంటారు. ‘వర్షం’తో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశాడు ఎంఎస్ రాజు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైంది. ఇప్పటికీ త్రిష అనగానే..తెలుగు ఆడియన్స్కి ఆ సినిమానే గుర్తొస్తుంది. అంతలా తన సహజ నటనతో ఆకట్టుకుంది త్రిష. అయితే ఈ సినిమాకు మొదటగా త్రిషని అనుకోలేదట. వేరే హీరోయిన్ని తీసుకోవాలని అనుకుంటే..త్రిషనే పట్టుపట్టి నటించిదట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శక-నిర్మాత ఎంఎస్ రాజు.
‘వర్షం కోసం త్రిషను అనుకోకుండా తీసుకున్నాం. ఓ రోజు మహేశ్ బాబు ఆఫీస్లో త్రిష ఫోటో చూశా. తన కొత్త సినిమా కోసం తీసుకుందామని అనుకుంటే.. క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదని మహేశ్ చెప్పాడు. అయితే నా సినిమాలో హీరోయిన్గా తీసుకోవచ్చా అని ఫోటోలు అడిగా. ఆ తర్వాత చెన్నై వెళ్లి త్రిష వాళ్ల అమ్మతో మాట్లాడా. అప్పుడు త్రిష ఇంట్లో లేదు. నేను మాట్లాడుతుండగా.. జీన్స్తో వచ్చింది. కొంచెం బరువు తగ్గాలని చెప్పా. అంటే.. ‘హీరోయిన్గా మా అమ్మాయిని తీసుకున్నారా?’ అని త్రిష వాళ్ల అమ్మ అడిగింది. నేను అవునని చెప్పి వచ్చేశా. వర్షం సినిమా సమయంలో దాదాపు 70 రోజులు వానలో తడిసింది త్రిష. నేను ఏది చెబితే అది చేసేది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాలో వేరే హీరోయిన్ని తీసుకోవాలనుకున్నాం. ఈ విషయం త్రిషకు తెలిసింది. ఒక రోజు ఎయిర్పోర్ట్లో దిగి..డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది. భోజనం చేసింది. తర్వాత డైయిరీ తీసి.. ‘నీకు ఎన్ని రోజులు డేట్స్ కావాలో రాసుకో’ అని చెప్పింది. అంతలా నాపై ప్రేమ చూపించేది. ఆమెకు నేనంటే ప్రాణం. ఎంతలా అంటే ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్లు..'రాత్రి 3 గంటలకు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు' అని ఆమెని అడిగితే మరో ఆలోచన లేకుండా నా పేరు చెప్పింది.
ఇక ‘ఆట’ సినిమా షూటింగ్ సమయంలో త్రిష నాపై అలిగింది. ఆ చిత్రానికి నేను ఇలియానాను తీసుకోవడంతో బాధపడింది. విషయం తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేసి షూటింగ్ స్పాట్కు వస్తానని చెప్పింది. దానికి నేను 'ఇప్పటికే హీరోయిన్ను ఫైనల్ చేశాం. మేము రాజమండ్రి దగ్గర బోటులో షూటింగ్ చేస్తున్నాం అని చెప్పాను. ఆ తర్వాత త్రిష మౌనంగా ఉండిపోయింది. బాధపడి ఉంటుందని చెప్పి ఆ రోజు సాయంత్రం నేను ఆమెకు ఫోన్ చేసి, 'నీలాంటి వారు ఎవరూ ఉండరు. ఇలియానాతో ఇబ్బంది అవుతుందని సరదాగా చెప్పా. వాస్తవానికి ఇలియానా చాలా బాగా నటించింది. కానీ త్రిషని ఓదార్చడానికి అలా అబద్దం చెప్పా’ అని ఎంఎస్ రాజు త్రిషతో తనకు ఉన్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు.


