- తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నెక్స్ట్-జనరేషన్ AI ఆధారిత 'డయల్ 112' అత్యవసర సేవల వ్యవస్థ ప్రారంభం
- ఒకే జాతీయ అత్యవసర నంబర్ '112'తో పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా రక్షణ మరియు విపత్తు నిర్వహణ సేవల అనుసంధానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో వేగవంతమైన స్పందన; కాల్ ప్రాసెసింగ్ సమయం 30 శాతం తగ్గుదల.
- రాష్ట్ర సగటు రెస్పాన్స్ సమయం 10 నిమిషాల 30 సెకన్లు – జాతీయ సగటు కంటే మెరుగైన ప్రతిభ.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, స్మార్ట్ మరియు సమన్వయంతో కూడిన సహాయాన్ని అందించడానికి తెలంగాణ పోలీసు శాఖ 'నెక్స్ట్-జనరేషన్ TG-ERSS డయల్ 112' వేదికను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC)లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ సీ.వీఆనంద్ ఈ ఆధునిక వ్యవస్థను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ సీ.వీ. ఆనంద్ మాట్లాడుతూ "సాంకేతిక ఆధారిత పోలీసింగ్ మరియు పౌర కేంద్రిక అత్యవసర సేవల దిశగా తెలంగాణ వేస్తున్న అడుగుల్లో ఈ నెక్స్ట్-జనరేషన్ డయల్ 112 ప్లాట్ఫామ్ ఒక ప్రధాన మైలురాయి. అత్యవసర సమయాల్లో బాధితులకు డయల్ 112 మొదటి రక్షణ కవచంగా పనిచేస్తుంది. అందువల్ల ప్రతి కాల్ను ఎంత వేగంగా, వృత్తిపరంగా నిర్వహిస్తామనే దానిపైనే పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది" అని పేర్కొన్నారు.
వ్యవస్థ ప్రాముఖ్యత
ఆధునిక వ్యవస్థ ప్రత్యేకతలు & AI సాంకేతికత
•ఏకీకృత సేవలు: పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ సేవలను 112 అనే ఒకే జాతీయ నంబర్కు అనుసంధానించారు.
•AI ఆధారిత కాల్ ఫిల్టరింగ్: అనవసరమైన, స్ప్యామ్, సైలెంట్ మరియు చైల్డ్ కాల్స్ను ప్రాథమిక స్థాయిలోనే ఫిల్టర్ చేసి, అసలైన అత్యవసర కాల్స్కు ప్రాధాన్యత ఇస్తుంది.
•కాల్ రౌటింగ్ & డిస్పాచ్: కాల్ స్వభావాన్ని బట్టి సంబంధిత రెస్పాన్స్ టీమ్కు AI సాంకేతికత ద్వారా దారి మళ్ళిస్తుంది.
•వాయిస్-టు-టెక్స్ట్: మాట్లాడే సంభాషణను ఆటోమేటిక్గా పాఠ్య రూపంలోకి (Text) మారుస్తుంది.
•ఖచ్చితమైన లొకేషన్ గుర్తింపు. ప్రస్తుతం 94% కాలర్ల లొకేషన్ను ఖచ్చితంగా గుర్తిస్తున్నారు.
•డ్రోన్ సాంకేతికత.. రాబోయే రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో డ్రోన్లను "ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్లుగా" ఉపయోగించనున్నారు.
మౌలిక సదుపాయాలు & వాహనాల అనుసంధానం
• ఈ సెంటర్ 24x7 ప్రాతిపదికన 164 మంది శిక్షణ పొందిన సిబ్బంది, 900 SIP ఆధారిత ఛానళ్లతో పనిచేస్తుంది.
• రోజువారీగా దాదాపు 14 లక్షల కాల్స్ IVR ను చేరుతుండగా, 18,000 ఎమర్జెన్సీ కాల్స్ను సిబ్బంది స్వీకరిస్తున్నారు. రోజుకు సుమారు 7,500 సంఘటనలకు ఫీల్డ్ యూనిట్లను పంపుతున్నారు.
• రాష్ట్రంలోని 31 పోలీసు యూనిట్ల పరిధిలో ఉన్న 1,860 పెట్రోలింగ్ వాహనాలను (788 నాలుగు చక్రాల వాహనాలు, 1,072 ద్విచక్ర వాహనాలు) డిజిటల్గా అనుసంధానించారు. సంఘటన స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్ని సిస్టమ్ ఆటోమేటిక్గా గుర్తించి పంపుతుంది.
ప్రజలందరూ పోలీసు, ఫైర్, అంబులెన్స్ ఇతర సేవలకు ఒకే ఎమర్జెన్సీ నంబర్ 112 ను గుర్తుంచుకోవాలని డీజిపి గారు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నంబర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా AI వేదిక పనిచేసే తీరు, లొకేషన్ గుర్తింపు, వాహనాల కేటాయింపు మరియు లైవ్ డాష్బోర్డ్ల పనితీరుపై ప్రత్యక్ష డెమో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, TGCSB & FSL డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్; డీజీపీ (సాంకేతిక సేవలు) శ్రీ వి.వి. శ్రీనివాసరావు,హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ TGiCCC డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, ఐపీఎస్ (రిటైర్డ్); సైబరాబాద్ సీపీ డా. ఎమ్. రమేష్, ఐపీఎస్ మల్కాజిగిరి సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్; తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ శ్రీ విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ డీజీ చారూ సిన్హా, ఐజీపి గజరావ్ భూపాల్, TGTS మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి మల్టీ జోన్-I ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ లతో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.


