ఉద్యమాన్ని ఆపబోమన్న విద్యార్థులు
20వ రోజుకు చేరిన పరీక్షార్థుల నిరసనోద్యమం
రాంచీ: జార్ఖండ్లో ఉద్యోగ నియామక ప్రక్రియలో అక్రమాలకు స్వస్తి పలకాలంటూ ఉద్యమిస్తున్న విద్యార్థులు, పరీక్షార్థులు పదో తేదీన రాంచీలో అసెంబ్లీ ముట్టడి వేళ లాఠీచార్జ్, పలువురికి గాయాలైన ఘటనలో పోలీసులు కేసుల నమోదు మొదలెట్టారు. శాసనసభ సమీపంలోని విధాన్ సభా పోలీస్స్టేషన్లో గుర్తు తెలియని 300 మందిపై కేసులు నమోదుచేశారు.
‘‘పదో తేదీన అసెంబ్లీ సమీపంలో పోలీసులపై రాళ్లు రువ్వి, ఉద్రిక్తతలకు కారణమైన గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదుచేశాం. విద్యార్థుల శాంతియుత ర్యాలీ వెంటనే ఉద్రిక్తంగా తయారైంది. రాళ్ల దాడిలో 14 మంది పోలీసులు గాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు, వీడియోలో ఫుటేజీలను పరిశీలించి ఆయా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తాం’’అని రాంచీ ఎస్పీ పరాస్ రాణా గురువారం చెప్పారు.
మరోవైపు రాంచీలోని జైపాల్సింగ్ ముండా స్టేడియంలో పరీక్షార్థుల ఉద్యమం గురువారం 20వ రోజుకు చేరుకుంది. ‘‘ఉద్యమనేతల నిరాహార దీక్షలు కొనసాగించారు. పరీక్షల విధానంలో సంస్కరణలు, పాత పరీక్షలను రద్దుచేయడం, నియామక ప్రక్రియలో అక్రమాలపై ఇతర రాష్ట్రాల మాజీ జడ్జీలతో దర్యాప్తు జరిగేదాకా ఉద్యమం కొనసాగుతుంది. డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. 12 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆస్పత్రిపాలైన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో తాజా ఆరోగ్యస్థితిని ప్రభుత్వం బహిర్గతంచేయట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


