సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూరంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కఠిన చర్యలు ఉంటాయ్: ఎస్పీ
జిల్లాలో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంక్షలపై వైఎస్సార్సీపీ మండిపాటు
ములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్ను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్కు దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, బారికేడ్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే..
అభిమానాన్ని ఆపలేరు
జగన్ పర్యటనలకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ను కలిసేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలివస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన కూడా విజయవంతమవుతుందని అంటున్నారు.
జగన్ భద్రతపై ఆందోళన
మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. భద్రతా అంశాలు, పోలీసుల ఆంక్షలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.


