ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును అభినందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలి
ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పని చేయాలి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
సాక్షి, అమరావతి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా టి.మాధవరావును ప్రకటించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దాన్ని భర్తీ చేసే ప్రక్రియపై సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవి రాజ్యాంగ పరంగా కీలకమైందని తెలిపారు.
అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టే మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారని గుర్తు చేశారు. ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉందని, త్వరలో ఆ పదవి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తరఫున తూమాటి మాధవరావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మాధవరావు ఎన్నికకు అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


