ఇక మరింత గట్టిగా పోరాటం | YS Jaganmohan Reddy direction to YSRCP public representatives | Sakshi
Sakshi News home page

ఇక మరింత గట్టిగా పోరాటం

Aug 13 2026 5:12 AM | Updated on Aug 13 2026 5:12 AM

YS Jaganmohan Reddy direction to YSRCP public representatives

ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి 

వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

శాసనసభలో ప్రజా సమస్యలు వినిపించకూడదని మన గొంతు నొక్కుతున్న ప్రభుత్వం 

అందుకే ఏకైక ప్రతిపక్షమైనా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు 

అలా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుంది 

ఆ హక్కు ఇవ్వడం ఇష్టం లేకనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు

మండలిలో మనకు మంచి సంఖ్యా బలం ఉన్నందున గట్టిగా గొంతెత్తాలి 

గతంలోనూ బాగా పోరాడాం.. ఇప్పుడు కూడా అదే రీతిలో ప్రశ్నించాలి  

డీఎస్సీ–2025లో లీకేజీలు, అనేక అక్రమాలపై 74 రోజులుగా పోరాడుతున్నాం 

సాక్ష్యాలు, ఆధారాలు చూపుతూ ఇప్పటికే 10 రకాలుగా ఆందోళన చేశాం 

ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే 

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాల్సిందే.. అప్పుడే నిజాలు వెలుగు చూస్తాయి 

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు రూ. 9 వేల కోట్లకు పైగా  ఇవ్వాలి 

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు చొప్పున ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలి.. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు 

ఉచిత పంటల బీమా లేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు.. తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం 

కొత్త పీపీపీ పాలసీతో రాష్ట్రానికి అంతులేని నష్టం.. అన్నీ ప్రైవేటీకరిస్తే ప్రభుత్వం ఎందుకు? 

దిశ వ్యవస్థ రద్దు.. బీసీ నేతలపై తప్పుడు కేసులు.. శ్వేతపత్రాల పేరిట పచ్చ, అబద్ధపు పత్రాలు 

మండలిలో వీటన్నింటిపై ఆధారాలతో ప్రశ్నించాలి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య­మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ సభలో బలంగా ప్రస్తావించాలని.. ముఖ్యంగా శాసన మండలిలో పార్టీకి బలం ఉన్నందున ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా పోరాడాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. గతంలోనూ పార్టీ ఎమ్మెల్సీలు ప్రజా సమ­స్యలపై పోరాటాలు చేశారని, ఆదే రీతిలో ప్రస్తుత సమావేశాలకు మరింత సన్నద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో వైఎస్సార్‌సీపీ గొంతు వినిపించకూడ­దనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వెన్ను­పోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందంటూ ఎత్తిచూపారు. వైఎస్సార్‌సీపీ­ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే.. ప్రతిపక్ష నాయకు­డికి సభలో మాట్లాడేందుకు నిర్ణీత సమయం, హక్కులు వస్తాయని, అందుకే ప్రభుత్వం ఆ హోదా ఇవ్వడానికి ఇష్టపడటం లేదన్నారు. ‘‘వైఎస్సార్‌­సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించక పోవడం వల్ల అసెంబ్లీలో పార్టీకి సమయం లభించే అవకాశం పరిమితంగా ఉంటుంది. అందుకే సాక్ష్యాధారాలతో­సహా, బయట ప్రెస్‌మీట్ల ద్వారా సమాధానం చెబు­దాం.. ఆ విధంగా ప్రజలకు ఒకవైపు మాత్రమే కా­కుండా, ప్రతి అంశంలోనూ ‘నాణేనికి రెండో వైపు’ చూపించే ప్రయత్నం చేద్దాం’’ అని చెప్పారు. శాసన­సభ, మండలి వర్షాకాల సమావేశాల సందర్భంగా బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మండలి సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద­ర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

డీఎస్సీ అక్రమాలపై రాజీ లేని పోరాటం
‘‘డీఎస్సీ–2025లో పేపర్‌ లీకేజీ, అంతులేని అక్ర­మాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తాం. అదే మన మొదటి ప్రాధాన్యం. అందుకే ఈ అంశాన్ని శాసనమండలిలో ప్రధా­నంగా లేవనెత్తాలి. డీఎస్సీ వ్యవహా­రంపై ఇప్పటికే 74 రోజులుగా దాదాపు 10 రకాల ఆందోళన కా­ర్యక్రమాలు నిర్వహించాం. డీఎ­స్సీలో అక్రమాలకు నైతిక బా­ధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్‌ రాజీనా­మా చేయాలి. ఇంకా ఈ స్కా­మ్‌­పై సీబీఐ దర్యాప్తు కొనసా­గాల్సిందే. డీఎస్సీ అక్ర­మా­లకు సంబంధించిన ఆధా­రాలు, సా­క్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందుంచాం. డీఎస్సీలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికే ఫస్ట్‌ ర్యాంకు రావడం చూశాం. మెరిట్‌ లిస్టులు మారిన వ్యవహారాలు కూడా బయటపడ్డా­యి. డీఎ­స్సీ లీకేజీ ఎంతదూరం వెళ్లిందో పూ­ర్తిగా తేలా­ల్సిందే. అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. అయితే సీబీఐ విచా­రణకు ఈ ప్రభుత్వం ముందు­కు రావ­డం లేదు. అయినా వీ­ళ్లుంటే నిజాలు బయ­టకు వ­స్తా­యా? అందుకే మంత్రి లోకేశ్‌ రాజీ­నామా చేయా­లని డిమాండ్‌ చేస్తున్నాం. ఇవ­న్నీ జరి­గితేనే డీఎస్సీలో అక్రమా­లన్నీ వెలుగులోకి వస్తాయి.

తీవ్ర సంక్షోభంలో రైతులు
రాష్ట్రంలో రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. పంటలు వేసుకోమని చెప్పి.. 40 శాతం పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు ఇవ్వలేమంటున్నారు. రైతులకు అండగా ఉన్న ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. వీటన్నింటితో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. అందుకే వారి సమస్యలపైనా మండలిలో గట్టిగా పోరాడాలి.

‘ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌’ అన్నట్లుగా పీపీపీ
కొత్త పీపీపీ విధానం చూస్తే ‘ఆంధ్రప్రదేశ్‌ ఫర్‌ సేల్‌’ అన్నట్టుగా ఉంది. పీపీపీ ప్రాజెక్టు­లకు ప్రభుత్వమే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇవ్వాలని నిర్ణయించ­డం దారుణం. ఇంకా ఆ ప్రైవేటు సంస్థ తీసుకునే రుణాలకు వడ్డీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందంటున్నారు! అంటే రాయి­తీలు ప్రభుత్వం ఇవ్వాలి.. ఆ తర్వాత ఆ ప్రైవేటు కంపె­నీలు ప్రజల నుంచి యూ­జ­ర్‌ ఛార్జీలు వసూలు చేసుకో­వచ్చంటున్నారు. అంటే ప్రై­వేటుకు అన్ని రాయితీలు ఇ­చ్చి చివరకు ప్రజలపైనే ‘బా­దుడే బాదుడు’ కార్య­క్ర­మం అ­న్న­మాట. తాగు నీరు, స్కూ­ళ్లు, ఆస్పత్రులు, రవాణా సహా ప్రజా సేవలను పీపీపీ పరిధి­లోకి తెస్తామంటున్నారు. అన్నీ ప్రైవేటు­కే అప్పగిస్తే ఇక ప్రభుత్వం ఉండేది ఎందుకు? కేవలం స్కామ్‌లు చేసి లూటీ చేయడానికా?

అవి పచ్చ పత్రాలు.. అబద్ధాల పత్రాలు
చంద్రబాబు ఆర్భాటంగా విడుదల చేస్తున్న వైట్‌ పేపర్లన్నీ ‘ఎల్లో పేపర్లు’. ఇంకా చెప్పాలంటే పచ్చి అబద్ధాల పత్రాలు. ఆ పత్రాల్లో ప్రభుత్వం చెప్పిన అంశాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ వైట్‌ పేపర్లలోని అబద్ధా­లను ఆధారాలు, సా­క్ష్యా­లతో ఇప్ప­టికే బయటపె­ట్టాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ఎమ్మెల్యే­లు, ఎమ్మెల్సీలకు అంది­స్తాం. మన పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా సాక్ష్యా­లు, ఆధారాలతో మాట్లాడా­లి. అది నేనైనా, మీరైనా, మ­రె­వరైనా సరే. ఒక నివేది­కలోని అంశాన్ని ప్రస్తావిస్తే.. ఆ నివేదిక ఎక్కడిది? ఏది? ఆ సమాచారం ఏ పేజీలో ఉంది? ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కూడా ప్రజలకు చూపించాలి. సోర్స్‌ లేకుండా ఆరోపణలు చేయొద్దు. పూర్తి ప్రిపరేషన్‌తోనే ప్రజల ముందుకు వెళ్లాలి. వైఎస్సార్‌సీపీ ఏది మాట్లాడినా సాక్ష్యాలు, ఆధారాలు.. అంటే పక్కా సోర్స్‌తో మాట్లాడుతుంది. నేను కానీ, పార్టీ నాయకుడు కానీ మాట్లాడే ప్రతి అంశానికి సోర్స్‌ చూపిస్తాం. అదే చంద్రబాబు మాత్రం తాను చెప్పే ఏ అంశాలకు సోర్స్‌ చెప్పడు. ఎందుకంటే అవన్నీ అబద్ధాలు కాబట్టి. పచ్చి అబద్ధాలు చెప్పడమే ‘వెన్నుపోటు పార్టీ’ పని.

విజన్‌–2020 అర్థం లేని యోచన
మాట్లాడితే చంద్రబాబు విజన్‌ డాక్యుమెంట్లు అంటాడు. గతంలో కూడా విజన్‌–2020 అంటూ నానా హడావిడి, హంగామా, భారీ ప్రచారం చేశారు. కానీ, వాస్తవంగా దాని వల్ల సాధించిందేమీ లేదు. అసలు విజన్‌–2020 డాక్యుమెంట్‌ ఏమైంది? అందులో చెప్పిన దాంట్లో ఎన్ని సాధించారు? వీటికి సమాధా­నం లేదు. ఇప్పుడు విజన్‌–2047 అంటూ హడావిడి చేస్తున్నారు. కాగా, గతంలో విజన్‌–2020­కి సంబంధించి, 2000లో స్విస్‌ మంత్రి పాస్కల్‌ ఉ­మ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన సందర్భంగా ‘అ­లాంటి మాటలు తమ దేశంలో చెబితే జైల్లోనో, మానసిక ఆస్పత్రి­లో­నో పెడతారు’ అన్నారు. కళ్లార్పకుండా ప­చ్చి అబ­ద్ధా­లు చెప్పడంలో చంద్రబాబుకు సాటిలే­రు. అదే స్థా­యి­లో అబద్ధాలు చెప్పేలా లోకేశ్‌కు కూడా శిక్షణ ఇ­చ్చా­రు. కేవలం అబద్ధాలు చెప్పడం.. అదే పనిగా ప్ర­చా­రం చేసుకోవడం వెన్నుపోటు పార్టీకి అలవాటు.

ఏ వర్గమూ సంతృప్తిగా లేదు
జూనియర్‌ డాక్టర్లు స్టైపెండ్‌ పెంపు కోసం ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఇంకా రాష్ట్రంలో ఉద్యోగులు సహా ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత.. ఏ వర్గమూ సంతోషంగా లేదు. పాత పథకాలను రద్దు చేశారు. కొత్త పథకాలు మోసాలుగా మారాయి. మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూత పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆ గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. మహిళలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల సంఖ్య కూడా తగ్గుతోంది. జీవో నంబర్‌ 3 అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు దాని ఊసే లేదు. ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటిపై మండలిలో గట్టిగా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రిపరేషన్‌ లేకుండా ఎవరూ మాట్లాడొద్దు. పూర్తిగా కసరత్తు చేసి మాట్లాడితేనే విషయం ప్రజలకు బలంగా చేరుతుంది. కంటెంట్‌ అనేది అత్యంత ముఖ్యమైనది. ప్రతి అంశాన్నీ ఆధారాలు, సాక్ష్యాలతో వివరించాలి. సబ్జెక్టుల వారీగా సభ్యులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి’’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

విద్యా దీవెన, వసతి దీవెన రూ.9 వేల కోట్లకు పైగా బకాయి 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 13 త్రైమాసికా­లుగా పెండింగ్‌లో ఉంది. ఒక్కో త్రైమాసికా­నికి సుమా­రు రూ.700 కోట్ల చొప్పున రూ.9,100 కోట్లు పెండింగ్‌. వసతి దీవెన కింద మరో రూ.­3,300 కోట్లు పెండింగ్‌. రెండూ కలిపి రూ.12,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. కానీ వెన్నుపోటు పా­ర్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.2,900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా, రూ.9 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. బీసీల తలరాతలు మార్చే ఫీ­జు రీయింబర్స్‌మెంట్‌ పథకా­న్నే నిర్వీర్యం చేస్తు­న్నారు. కాబట్టి బకాయిలపై మండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. చర్చ కోసం పట్టుబట్టాలి. విద్యార్థుల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలి.

‘దిశ’ వ్యవస్థ రద్దు.. బీసీ నాయకులపై కేసులు
‘దిశ’ వ్యవస్థ రద్దు వల్ల రాష్ట్రంలో మహిళలు, యువతు­లకు రక్షణ లేకుండా పోయింది. బీసీ నాయకులపై కేసు­లు కీలక అంశాలు. గాంధీ పుట్టిన దేశంలో శాంతియుత నిరసనలు చేసినా కేసులు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం శాంతియుతంగా నిరసనలు చేసినా కేసులతో అణచి వేయాలని చూస్తున్నారు. శాంతియు­తంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామనే కక్షతో అన్యాయమైన కేసులు పెడుతున్నారు. వీటన్నింటిపై కచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. జరగని ఘటనను జరిగినట్టుగా వక్రీకరించి చింతాడ రవిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసుల కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. గుంటూరులో ముస్తఫాపై తప్పుడు కేసు పెట్టారు. ఎమ్మెల్యే విరూపాక్షిపైనా అక్రమ కేసులు పెట్టారు. పార్టీలో బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా కారుమూరు సునీల్‌పైనా తప్పుడు కేసు పెట్టారు. ప్రశ్నించే వారందరిపైనా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.

స్పోర్ట్స్‌ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలు
డీఎస్సీలో ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా పేరుతో జీవోలు జారీ చేసి అక్రమాలకు తెర తీశారు. వెన్నుపోటు పార్టీ నాయకులే క్రీడా సంఘాల్లో కీలక స్థానాల్లో ఉండటం, వారి పరిధిలోనే సర్టిఫికెట్లు జారీ కావడం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంది. పోటీ పరీక్ష లేకుండా, డీఎస్సీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది. నియామకాలు పూర్తి కాగానే, మళ్లీ జీవోలు మార్చారు. అంటే ముందు చేసినది తప్పు అని ఒప్పుకున్నట్టే కదా? ఇన్ని అక్రమాలు, ఆధారాలు కనిపిస్తు­న్నç­³్పుడు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయా­ల్సిందే. సీబీఐ విచారణ జరగాల్సిందే. దాని ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయి. డీఎస్సీ నియామకాలకు సంబంధించి రెండు జీవో­లు, మెరిట్‌ లిస్టుల మార్పులు, ఉద్యోగాల కోసం డబ్బులు అడిగినట్టుగా ప్రచారంలోకి వచ్చిన ఆడియో, వీడియో కాల్స్‌ వంటి అంశాలన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఫోన్‌ నంబర్లు, లావాదేవీలకు సంబంధించిన వివ­రాలు ఉన్నప్పటికీ కేసుల్లో అసలు వ్యక్తుల పేర్లు స్పష్టంగా నమోదు చేయలేదు. సోషల్‌ మీడియాలో బయటకు వచ్చిన కొన్ని ఆరో­పణల్లో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షల వరకు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు బాధితులే చెబుతున్నారు. ఇన్ని ఆధారాలు బయట కని­పి­స్తున్నప్పుడు డీఎస్సీ ఒక ప్రధాన అంశం. దీని­పై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అలాగే మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement