భారతదేశంపై ఏమాత్రం అవగాహన లేదు
స్వలాభం కోసం ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమే వారి సిద్ధాంతం
బీజేపీ–ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ను భారతదేశంపై అవగాహన లేని జోకర్ల గుంపుగా అభివరి్ణంచారు. దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత వాస్తవికతపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ గుంపునకు ఏమీ తెలియదని ఆరోపించారు. తమకు, మరికొందరికి ప్రయోజనం చేకూర్చే ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమే బీజేపీ–ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతమని మండిపడ్డారు.
ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని ఎగతాళి చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు.
బడా బాబులు ఆర్ఎస్ఎస్ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. నేటి భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రభుత్వ వైఖరికి వంతపాడుతోందని అన్నారు. మీడియా పరిమితులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. కొంతమంది విదూషకులు మనపై పెత్తనం చెలాయించకుండా చూడటమే జాతీయ స్ఫూర్తి అని స్పష్టంచేశారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామాలు సమర్పించాల్సిందేనని, అప్పటిదాకా వారికి నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. వారిని నిద్రపోనివ్వబోమని వ్యాఖ్యానించారు. ద్వేషం, హింస లేకుండానే అనుకున్నది సాధిస్తామని స్పష్టంచేశారు. మన సంస్కృతి కోసం పోరాడుతున్నామని వివరించారు. మన దేశం ద్వేషం, పగతో కాకుండా ప్రేమ, సోదరభావం, అహింసతో ముడిపడి ఉందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.


