పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.
కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
BJP faces allegations of disrespecting Indian flag in Kerala's Kasaragod
Several Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026
మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.
Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3
— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026
ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి.


