breaking news
railway worker
-
విజయవాడలో రైల్వే కార్మికుడు మృతి
-
పని జెండర్ ఎరగదు
‘ఎవరన్నారీ పని మగవాళ్లదని...’ సంధ్యా మారవి ఈ మాట అనలేదు. కానీ... ఇది మగవాళ్ల పని మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఆడవాళ్ల పని కూడా. అంతకంటే ముందు ఇది మనిషికి అన్నం పెట్టే పని... అని నిరూపించింది. ఒక చాదస్తపు సంప్రదాయ గిరిగీతను చెరిపివేసింది. కుటుంబాన్ని పోషించడానికి ఇంటి మగవాడు ఉన్న ఆడవాళ్లకు ఇది మగవాళ్ల పనిగానే కనిపిస్తుందేమో! అన్నం పెట్టే వాడు ‘పిల్లలకు ఇక నుంచి తల్లీతండ్రీ నువ్వే’ అని అకస్మాత్తుగా తనువు చాలించిన సంధ్య లాంటి వాళ్లకు మాత్రం కాదు.‘ఇది ఆడవాళ్లు చేసే పని కాదు’ అని చేతులు ఒడిలో పెట్టుకుని, మౌనంగా కూర్చుంటే పిల్లలకు వేళకింత అన్నం ఎవరు పెడతారు?... ఇవన్నీ సంధ్య మౌనంగా సంధించే ప్రశ్నలు. సంధ్యామారవి కాట్ని రైల్వే స్టేషన్లో కూలీ. ఆమెది మధ్యప్రదేశ్, జబల్పూర్ జిల్లా కుందం గ్రామం. జబల్పూర్ నుంచి కాట్నికి 90 కిలోమీటర్లు. ఆమె ఉద్యోగానికి వెళ్లాలంటే రోజూ బస్సులో సొంతూరు కుందం నుంచి జబల్పూర్కి, అక్కడి నుంచి రైల్లో కాట్నికి చేరుకోవాలి. డ్యూటీ ముగిసిన తర్వాత అదే రూట్లో తిరుగు ప్రయాణం. అటూఇటూ కలిపి రోజుకు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరీ ఉద్యోగం చేస్తోంది. కాట్ని స్టేషన్లో 40 మంది పోర్టర్లున్నారు. వారిలో సంధ్య మాత్రమే అమ్మాయి. పసితనం పోని సంధ్య చేత పెట్టెలు మోయించుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందిపడుతుంటారు. ఇంత బలహీనంగా ఉన్న అమ్మాయి తమ సామాను మోయలేక కిందపడేసి పాడు చేస్తుందేమోననే భయం కూడా. ‘నేను మోయగలను సార్’ అని వాళ్లకు భరోసా ఇచ్చి మరీ బరువులు మోస్తోంది. రోజంతా బరువులు మోయడం కష్టంగా అనిపించడం లేదా అని ఎవరైనా ఆత్మీయంగా అడిగితే... ‘ఇంకా లోకం తెలియని ముగ్గురు పిల్లల భారం మోస్తున్నాను’ అంటుంది. ఆమె మాటల్లో లోతు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఆమెను చూస్తే బరువు మోయడానికి శక్తికంటే ఎక్కువగా ధైర్యం ఉండాలనిపిస్తుంది. ఆమె ఎవరి నుంచి కూడా సహాయాన్ని ఆశించడం లేదు. తన కుటుంబాన్ని తానే పోషించుకోగలను అంటోంది. అయితే ఆమె రైల్వే డిపార్ట్మెంట్ను కోరుతున్న సహాయం ఒక్కటే. అది కాట్ని స్టేషన్ నుంచి జబల్పూర్ స్టేషన్కి బదిలీ. అధికారులు స్పందించినప్పుడు ఆమెకి ఈ సుదీర్ఘమైన ప్రయాణం తప్పుతుంది. సంధ్యకు ఇద్దరు కొడుకులు, ఎనిమిదేళ్ల సాహిల్, ఆరేళ్ల హర్షిత్. కూతురు పాయల్కు నాలుగేళ్లు. సంధ్య ఉద్యోగానికి వేళ్లకు వెళ్లాలంటే తెల్లవారు జామున లేచి బయలుదేరాలి. సంధ్య అత్త ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటుంది. ‘నా కొడుకు అర్థంతరంగా పోయాడు. ఇంటి బరువును కోడలు తలకెత్తుకుంది. పిల్లల్ని చక్కగా బడికి పంపించి చదివిస్తాం. పెద్దయిన తర్వాత వాళ్లమ్మ కష్టాలను ఈ పిల్లలే తీర్చాలి’ అంటోందామె. – మంజీర -
కూలీ నెం.15
ఆడపిల్లలు ఇలాగే ఉండాలి! ఈ పనులే చేయాలి! తరతరాలుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఆ ప్రకారం నడచుకుంటూనే ఉన్నాం. కానీ తరం మారింది. అవసరాలు మారుతున్నాయి. మరి ఆలోచనలూ మారాలి కదా! ఇదే ప్రశ్న వేసుకుంది మంజూదేవి. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన ఓ అడుగు వేసింది. ఏ మహిళా చేయని, చేయడానికి సాహసించని వృత్తిలో అడుగుపెట్టింది. దానిని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తోంది! మంజూదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన సంపాదనతో వాళ్లని చదివిస్తోంది. ఆమె అంటుంది... ‘ఎవరో ఆదుకోవాలని ఎదురు చూడటం కంటే... గౌరవంగా మనకు తోచిన పని మనం చేసుకోవడం ఉత్తమం’ అని! జైపూర్ రైల్వేస్టేషన్కి వెళ్లినవాళ్లకు ఓ అరుదైన దృశ్యం కనబడుతుంది. ఎర్రటి చొక్కాలు వేసుకుని, బ్యాడ్జిలు పెట్టుకుని, వరుసగా ఉన్న కూలీల మధ్య ఓ యువతి కనిపిస్తుంది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమె కూడా రైల్వే కూలీ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా... నమ్మడానికి మాత్రం మన కళ్లు, మనసు ససేమిరా అంటాయి. ఎందుకంటే... కూలీ అంటే మనకు తెలిసి మగవాళ్లే. రైల్వేస్టేషన్లో, బస్టాపుల్లో లగేజీలు మోసేది వాళ్లే. అలాంటిది ఓ ఆడమనిషి ఆ పని చేస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని జాలి వేయకా మానదు. నిజమే... ఆమెకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అందుకే మహిళలు కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. సున్నితమైన చేతులతో బరువులు ఎత్తాల్సి వస్తోంది. ఆమె పేరు మంజూదేవి. జైపూర్లోనే కాదు... నార్త్ వెస్టర్న్ రైల్వేస్లోనే మొట్టమొదటి మహిళా కూలీ! విధిరాతకు తలవంచి... జైపూర్లోని సుందర్పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా... కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో తృప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్ జైపూర్ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మహదేవ్ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు... మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది. తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్ యూనియన్ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్ నంబర్ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా... భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో! అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ‘‘ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని! మగవారికి దీటుగా... కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది. ఇప్పుడు జైపూర్ రైల్వేస్టేషన్కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు. అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే... చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే... మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది! - సమీర నేలపూడి -
రైల్వే ఉద్యోగినిపై.. సహోద్యోగుల గ్యాంగ్ రేప్
కోల్కతా: మధ్యవయస్కురాలైన రైల్వే ఉద్యోగినిపై నలుగురు సహోద్యోగులే కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన కొల్కతాలో వెలుగు చూసింది. బాధితురాలిపై ఆ నలుగురు కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతాన్ని ఫొటోలు కూడా తీశారు. విషయాన్ని ఎవరికైనా చెప్పినా.. తమకు సహకరించకపోయినా.. ఆ ఫొటోలను నెట్లో పెట్టడంతోపాటు చంపేస్తామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని ఓ టీవీ చానల్తో శనివారం పంచుకోవడంతో విషయం వెలుగు చూసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. రైల్వే ఉద్యోగి అయిన బాధితురాలి భర్త.. 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమెకు రైల్వేలో ఉద్యోగం లభించింది. అనంతరం కొన్నాళ్లకు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదిలావుంటే, రైల్వే శాఖలో విధి నిర్వహణలో పరిచయం అయిన నలుగురు ఉద్యోగులు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. భర్తకు విడాకులు ఇచ్చి తమను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి తెచ్చారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో అతను ఆత్మహ త్యా యత్నం చేశాడు. మరోపక్క, ఆ నలుగురు బాధితురాలిపై చిత్పూర్ రైల్వేయార్డులోని ఖాళీ రైలు బోగీలో పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. తాను నిండు గర్భిణిని అని వేడుకున్నా నిందితులు కనికరించలేదని బాధితురాలు వాపోయింది. స్పందించిన డండం జీఆర్పీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.