మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే! | India Battles Extreme Heatwave, Beat The Heat Govt Recommends Traditional Cooling Foods And Yoga, Check Out Full Story | Sakshi
Sakshi News home page

మండుటెండను జయించే ‘ఆయుష్’ అస్త్రాలివే!

May 19 2026 7:34 AM | Updated on May 19 2026 10:39 AM

Beat the Heat Govt Recommends Traditional Cooling Foods and Yoga

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డజీహెచ్‌ఎస్‌), ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి రంగంలోకి దిగింది. వేసవి తాపం నుంచి ప్రజలను రక్షించేందుకు అత్యవసర, సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే సంప్రదాయ ఆహార పదార్థాలైన కొబ్బరి నీళ్లు, షర్బత్‌తో పాటు యోగా, ఇతర ఆరోగ్య జాగ్రత్తలను ఇందులో ప్రధానంగా ప్రస్తావించింది.

తీవ్రమైన వడగాల్పులు.. అప్రమత్తతే రక్షణ
దేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ, డీజీహెచ్‌ఎస్‌తో కలిసి ఈ వేసవి కాలానికి సంబంధించిన ఒక సమగ్ర మార్గదర్శకాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలతో పాటు కార్మికులు, క్రీడాకారులు, భారీ బహిరంగ సభల్లో పాల్గొనే వారిని వడదెబ్బ తదితర అనారోగ్యాల నుంచి కాపాడటమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. ప్రజలు ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలని, మధ్యాహ్నం వేళ సూర్యరశ్మికి నేరుగా గురికాకుండా చూసుకోవాలని తెలియజేసింది. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉండే పానీయాలు తీసుకోవడం అత్యవసరమని సూచించింది.

ప్రాణాంతక వడదెబ్బ.. లక్షణాలు ఇవే
శరీరంలో నీటి శాతం పడిపోవడం వల్ల వచ్చే వడదెబ్బను ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి, వికారం, మానసిక స్థితిలో మార్పులు, అత్యధిక శరీర ఉష్ణోగ్రత, డీహైడ్రేషన్, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తం కావాలి. వడదెబ్బను అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణించి, పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే వెంటనే 108 లేదా 102 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి, వైద్య సహాయం పొందాలని సూచించింది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

ముప్పు పొంచి ఉన్న వర్గాలు.. ప్రత్యేక జాగ్రత్తలు
విపరీతమైన ఎండల కారణంగా కొన్ని వర్గాల ప్రజలకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికులతో పాటు గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వడగాల్పుల సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. అలాగే పని ప్రదేశాలు, బహిరంగ సభలు, ఇతర ఆరుబయట కార్యకలాపాల సమయంలో నీడ ఉండే విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. కార్మికులకు తరచుగా నీరు తాగేందుకు విరామం ఇవ్వడం, వడదెబ్బ లక్షణాలపై అవగాహన కల్పించడం వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాతావరణ శాఖ (ఐఎండీ) ఇచ్చే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

ఆయుర్వేదంలో అద్భుతమైన శీతలీకరణ మార్గాలు
ఈ వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు వివిధ ఆయుష్ వైద్య విధానాల్లోని నివారణ చర్యలను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా ఆయుర్వేదం శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహార పద్ధతులను సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు రోజూ తీసుకోవాలి. అలాగే తీవ్రమైన ఎండల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు నిమ్మరసం, పచ్చి మామిడి షర్బత్, తదితర  సంప్రదాయ పానీయాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేద విభాగం పేర్కొంది. ఇవి డీహైడ్రేషన్‌ను అడ్డుకుని శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

యోగా, సిద్ద వైద్యం ఇచ్చే ఉపశమనం
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగా.. వడదెబ్బ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సిద్ద, యోగా విభాగాలు వేసవిలో ప్రత్యేకమైన శ్వాస పద్ధతులను సూచించాయి. ముఖ్యంగా 'శీతలీ ప్రాణాయామం' చేయడం ద్వారా శరీరంలోని వేడిని సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే మితమైన యోగా సాధన వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. యునానీ వైద్య విధానం వడదెబ్బ, చర్మం కమిలిపోకుండా ఉండేందుకు కొన్ని మూలికా లేపనాలను సూచిస్తుండగా, హోమియోపతి విభాగం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తోంది.

తప్పనిసరిగా తీసుకోవాల్సిన వేసవి ఆహారం
వేసవిలో మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉండే, శరీరాన్ని చల్లబరిచే పండ్లు, కూరగాయలను దైనందిన ఆహారంలో చేర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కీరదోసకాయ, పుచ్చకాయ, నిమ్మకాయ, కర్బూజా (మస్క్ మెలన్), బూడిద గుమ్మడికాయ, టమోటాలు మొదలైన వాటిని తరచుగా తినాలి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉంటుంది. ఇలాంటి సంప్రదాయ,  సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మండుటెండలను సమ​ర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement