ఢిల్లీ వెళ్లిన ముగ్గురు టీచర్లపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం గొంతెత్తడం వారి తప్పయ్యింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను మినహాయించాలని కోరడం వారి నేరమైంది. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే వణికిపోతున్న చంద్రబాబు సర్కారు అన్యాయంగా ముగ్గురు ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. టెట్ సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సీకే వెంకటనాథరెడ్డి (ఏపీవైఎస్ఆర్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్), ఎస్.అమరనాథ్ (ఏపీవైఎస్ఆర్టీఏ కడప జిల్లా అధ్యక్షుడు), ఎన్.సంగమేశ్వర్ (ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో కడప జిల్లా అధ్యక్షుడు)లపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారని, దానిపై ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీకి వెళ్లారనే నెపంతో జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ఈ ముగ్గురిపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేయించింది. దీంతో విద్యాశాఖ మంత్రి లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని టీచర్లపై కూడా ప్రయోగిస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
వెళ్లింది ‘టెట్’ కోసం మాత్రమే..
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత కావడం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ ముగ్గురు ఉపాధ్యాయులు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రికి వీరు డీఎస్సీ అక్రమాలపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అదేదో పెద్ద నేరం, ఘోరంలా భావించిన చంద్రబాబు ప్రభుత్వం టెట్ అంశాన్ని దాచిపెట్టి, డీఎస్సీని తెరపైకి తెచ్చింది. పెండ్లిమర్రి మండలం ఎంపీపీఎస్ భారతి (వెంపల్లె)లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎన్. సంగమేశ్వరరెడ్డి, వేంపల్లి మండలం రాజీవ్నగర్ ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.అమరనాథరెడ్డి, పులివెందుల మండలం అహోబిలాపురం ఎంపీపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న సి. వెంకటనాథరెడ్డిలను సస్పెండ్ చేసింది.
ఈ ముగ్గురు డీఎస్సీ నియామకాలపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారని కడప జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే వాట్సాప్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకోవడం విస్తుగొలుపుతోంది. కాగా, 20–30 ఏళ్లుగా పని చేస్తున్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడంపై ఇటీవల ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలవడం.. ఓ వైపు న్యాయ పోరాటం చేసూ్తనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వారికి భరోసా ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలు, ఎమ్మెల్సీలు కేంద్ర మంత్రిని కలిశారు. ఇదిలా ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.


